Narayanpur Project | కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ)/గంగాధర: ‘నెర్రెలుబారిన మాగాణం’ శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. సోమవారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. రెండు పంపులు ఉన్నప్పటికీ ఒక పంప్ద్వారా 210 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
సాగునీరు అందక నారాయణపూర్ రిజర్వాయర్ ఆయకట్టు ఎండిపోతున్న తీరును ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గంగాధర మండలంలోని వెంకటాయపల్లి, కుర్మపల్లి, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్టు ప్రచురించింది. ఆదివారమే నీటిని విడుదల చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఎండుతున్న పంట పొలాలు, బావుల్లో పూడిక తీసుకుంటున్న రైతులు, పంటలను రక్షించుకునేందుకు బావుల్లో సైడ్ బోర్లు వేసుకుంటున్న తీరుపై కథనం ప్రచురించడంతో నీటి పారుదలశాఖ అధికారులు ఆగమేఘాలపై సాగు నీటిని విడుదల చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు పంప్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా అధికారులు ఒకే పంప్ ద్వారా 210 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల రిజర్వాయర్ నిండేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉన్నది. అదే రెండు పంపుల ద్వారా విడుదల చేస్తే రెండుమూడు రోజుల్లోనే నిండి ఎండుతున్న పంటలకు నీళ్లివ్వవచ్చని చెప్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, నారాయణపూర్ రిజర్వాయర్ ఈ ప్రాజెక్టుకు కీలకంగా ఉంది. దీని ద్వారా కరీంనగర్ జిల్లా పరిధిలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, జగిత్యాల జిల్లా పరిధిలోని కొడిమ్యాల, మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ, బోయినపల్లి తదితర మండలాల పరిధిలోని 46 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. ఉప కాలువలు పూర్తికాకపోవడంతో ప్రస్తుతం ఈ మండలాల పరిధిలోని 27 వేల ఎకరాలకే నీరు అందుతున్నది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల మండలాల్లోని 7,500 ఎకరాలకే యాసంగికి నీళ్లందించే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు.
నారాయణపూర్ రిజర్వాయర్ కింద పంటలు ఎండుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చి, నీటి విడుదలకు కారణమైన నమస్తే తెలంగాణ దినపత్రికకు ఈ ప్రాంత రైతులు ధన్యవాదాలు తెలిపారు. ‘నమస్తే’ కథనం నారాయణపూర్కు నీళ్లు వచ్చేలా చేసిందని నారాయణపూర్, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామాల రైతులు రిజర్వాయర్ వద్దకు వచ్చి సోమవారం సాయంత్రం సంబురాలు చేసుకున్నారు. రెండు పంప్ల ద్వారా నీటిని విడుదల చేస్తే ఎండుతున్న పంటలను రక్షించుకునే అవకాశాలు ఉంటాయని నారాయణపూర్ రిజర్వాయర్ను పరిశీలించేందుకు వచ్చిన నీటిపారుదలశాఖ ఈఈ శ్రీనివాస్గుప్తా, డీఈలు శ్రీనివాస్లు, అలీంకు రైతులు విజ్ఞప్తి చేశారు.