కుభీర్, ఫిబ్రవరి 24: ‘చీకటిలో సామాజిక తనిఖీ’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు నిర్మల్ జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం కుభీర్ మండల పరిషత్ ఆవరణలో ఈజీఎస్ ప్రజావేదిక కార్యక్రమం జరుగుతుండగా తరచూ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు సెల్ఫోన్ల వెలుతురులో కార్యక్రమాన్ని కొనసాగించారని ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు ఎస్ఈ జైవంత్రావు చౌహాన్ స్పందించి ‘నమస్తే’తో ఫోన్లో మాట్లాడారు. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వివరించారు.
కుభీర్లోని నయా ఆబాదిలో ఓ వ్యక్తి అక్రమంగా ఎల్టీ లైన్కు వైరు వేయడం వల్ల సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోయి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. తర్వాత ఫ్యూజ్ను మార్చి కరెంటు సరఫరాను పునరుద్ధరించినట్టు చెప్పారు. ఎలాంటి విద్యుత్తు కోతలు లేవని, వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్తు సరఫరాకు అహర్నిశలు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, కార్యాలయాల్లో సమావేశాలు ఉన్నప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు.