వేములవాడ, జనవరి 1: సిరిసిల్ల సెస్ ఎన్నికల ఓటమి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజేసింది. జిల్లా నాయకత్వ వైఫల్యంపై పార్టీ క్యాడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. కొందరు జిల్లా స్థాయి నాయకుల ఒంటెత్తు పోకడలతో పార్టీలో ఇమడలేకపోతున్నానని డీసీసీ ఉపాధ్యక్షుడు అరుణ్తేజ చారి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా మరో నాయకుడు అసమ్మతి రాగం వినిపించడం గమనార్హం. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను నమ్ముకుంటే న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ నాయకుడు ముడికే చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని ఏండ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్లకు సరైన గుర్తింపు లేదని వాపోయారు.
కాంగ్రెస్లోకి వలస వచ్చిన నాయకులకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాలుగు పార్టీలు మారిన ఆది శ్రీనివాస్ను ఇటీవలే జిల్లా అధ్యక్షుడిగా నియమించి, నాలుగు పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఆది శ్రీనివాస్ పార్టీలోకి వచ్చిన నాటినుంచి సీనియర్లకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. ఆయన తీరు నచ్చక ఎంతో మంది ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీని వీడారని, క్యాడర్ లేక వేములవాడలో పార్టీ కార్యాలయం సైతం మూతపడిందని అన్నారు.