SGT Posts | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లోనే జీవో విడుదల చేస్తామని విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు మాత్ర మే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయం తీసుకొన్నది. అయితే ఇటీవలే రాజస్థాన్ రాష్ట్రం టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి.. ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్సైట్లో ఆప్లోడ్ చేసింది. సుప్రీం తీర్పు దేశమంతటా అమలు కానున్నది.
2,575 ఎస్జీటీ పోస్టులు
రాష్ట్రంలో 6,612 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులే ఉన్నాయి. వాస్తవానికి ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారితో భర్తీచేసే నిబంధన గతంలో అమలైంది. తర్వాత ఈ నిబంధనను సవరించి బీఈడీ వారికి అవకాశం కల్పిస్తూ 2018లో ఎన్సీటీఈ గెజిట్ను జారీచేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో బీఈడీ వారు ఎస్జీటీ పోస్టులకు అర్హత సాధించలేకపోయారు. ఎన్సీటీఈ గెజిట్ ఆధారంగా ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బీఈ డీ వారు పోటీ పడే అవకాశాన్నిస్తూ బీహార్లో నోటిఫికేషన్ను జారీచేశారు. ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వెలువరించగా, ఆయా నోటిఫికేషన్ చెల్లదని తాజాగా ధర్మాసనం తీర్పునిచ్చింది. ఎస్జీటీ పోస్టులు డీఎడ్ వారితోనే భర్తీచేయాలని నిర్ణయించారు.