మారేడ్పల్లి, అక్టోబర్ 13: ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో సికింద్రాబాద్ యశోద దవాఖాన వైద్యులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పురుగుమందు తాగిన ఓ యువకుడికి ఏకకాలంలో రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేసి సరికొత్త చరిత్ర లిఖించారు. ఇందుకు సంబంధించిన వివరాలను దవాఖాన డైరెక్టర్ డాక్టర్ గోరుకంటి పవన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన రోహిత్ (23) విదేశానికి వెళ్లేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో స్థానిక వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించారు.
అనంతరం రోహిత్కు వివిధ రకాల వైద్యపరీక్షలు నిర్వహించగా.. పురుగుమందు విషం వల్ల అప్పటికే ఊపిరితిత్తులతోపాటు మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నట్టు తేలింది. దీంతో ఆయనకు వెంటనే మెకానికల్ వెంటిలేటర్స్తో వైద్యం అందించడంతోపాటు ఎక్మోపై 20 రోజులకుపైగా చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఊపిరితిత్తులను మార్చడమే ఏకైక మార్గమని నిర్ణయించారు.
అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో తదుపరి చికిత్స మొదలుపెట్టిన వైద్యులు.. ఊపిరితిత్తుల మార్పిడి కోసం జీవన్దాన్లో రోహిత్ వివరాలను నమోదు చేశారు. జీవన్దాన్ చొరవతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్, థొరాసిక్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కేఆర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ మిమి వర్గీస్ బృందం 6 గంటలపాటు శ్రమించి ఏకకాలంలో రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేశారు. డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా పూర్తిచేయడం ప్రపంచంలో ఇది తొలిసారని, ప్రస్తుతం రోహిత్ పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు.