జమ్మికుంట, జనవరి 25: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావును పదవి నుంచి దింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వేసిన పాచిక పారలేదు. చైర్మన్పై 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో పెట్టిన అవిశ్వాసం ఎట్టకేలకు వీగిపోయింది. గురువారం మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేకాధికారి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ చేరుకున్నారు. షెడ్యూల్ సమయం ఉదయం 10 గంటలలోపు చైర్మన్ రాజేశ్వర్రావుకు 14మంది, అవిశ్వాస తీర్మానం పెట్టిన పొనగంటి మల్లయ్య వర్గంలో ఉన్న 16మంది కౌన్సిలర్లు హాజరవుతారని అందరూ భావించారు. కానీ, అంద రి అంచనాలను తలకిందులు చేస్తూ 10.20 గంటలకు కేవలం పదో వార్డు కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి ఒక్కరే హాజరయ్యారు.
ఆ తర్వాత ప్రత్యేకాధికారి అవిశ్వాస పరీక్షను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. అప్పటికి కూడా ఇరువర్గాలకు చెందిన కౌన్సిల్ సభ్యులెవరూ హాజరుకాలేదు. మధ్యాహ్నం 1.30గంటల తర్వాత ప్రత్యేకాధికారి మహేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. కోరం లేదనందున అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు. కాగా ఇద్దరు మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జి, తదితర హేమాహేమీలు ఎంతో ఆరాటంతో చైర్మన్ గిరిని తమ ఖాతాలో వేసుకోబోయి బోల్తాపడ్డారు. కౌన్సిలర్ల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్కు చుక్కెదురైంది. కుట్రలను ఛేదించి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని నిలబెట్టుకొన్నది. ఆ తరువాత జమ్మికుంటకు వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అవిశ్వాసాల పేరిట జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ను ఇబ్బంది పెడితే తాము తిప్పికొట్టినట్టు తెలిపారు.