హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో గ్రూపులున్నాయని, రెండు సామాజిక వర్గాలుగా చీలిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ కార్యాలయం ఖండించింది. డీజీపీ మహేందర్రెడ్డితోపాటు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. రేవంత్ ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ నిరాధార ఆరోపణలని డీజీపీ కార్యాలయ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, నేర దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భారత టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీస్శాఖలో ఎలాంటి గ్రూపులు లేవని, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలసికట్టుగా టీమ్వర్క్తో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. విధుల ప్రాధాన్యత, సిబ్బంది మెరిట్ ఆధారంగానే వివిధ విభాగాల్లో పోస్టింగ్లు ఇస్తున్నట్టు తెలిపారు. నిరాధార ఆరోపణలు పోలీసుల ైస్థెర్యాన్ని దెబ్బతీస్తాయని, దీని ప్రభావం సమాజ భద్రతపై పడే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్లు సమాజంలో ఉంటే బాగుండేదని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ నుంచి దాదాపు 350 మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని, అర్థరహితమైన మావోయిస్టల హింసకు అమాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ఎంతో మంది ప్రజాప్రతినిధులు బలయ్యారని పేర్కొన్నారు.