హైదరాబాద్, జులై 10 (నమస్తే తెలంగాణ): సముద్రతీర ప్రాంతం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం నీలివిప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని చెరువులన్నీ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వెరసి మత్స్య సంబురం కొనసాగుతున్నది. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పథకం అద్భుతాలు సృష్టస్తున్నది. కేవలం ఏడేండ్లలోనే ఈ పథకం అక్షరాల రూ.32 వేల కోట్ల సంపదను సృష్టించింది. గడిచిన ఏడేండ్లలో ఈ పథకం ద్వారా రూ.413.66 కోట్ల ఖర్చుతో 442.47 కోట్ల చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. ఇందులో రూ.349 కోట్లతో 414 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేసింది. ఇంత భారీ మొత్తంలో ఖర్చుతో చేప పిల్లల్ని పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ప్రభుత్వం ఉచితంగా పంపణీ చేసిన చేప పిల్లల ద్వారా 22.5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి.
ఈ ఉత్పత్తి విలువ రూ.32 వేల కోట్లు. ఈ సంపద అంతా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వానికి వచ్చింది కాదు. అచ్చంగా మత్స్యకారులకు దక్కిన సంపద ఇది. ఇది చాలు.. రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పడానికి. ఈ పథకాన్ని ప్రారంభించిన 2016-17 సంవత్సరంలో 3,939 నీటి వనరుల్లో చేపపిల్లలను వదిలిపెట్టగా.. 2022-23లో 23,748 జలవనరుల్లో చేప పిల్లలను పెంచడం విశేషం. తొలి ఏడాది రూ.2,252.20 కోట్ల విలువైన సంపదను సృష్టించగా 2022-23 నాటికి ఆ సంపద విలువ రూ.6,656.27కు పెరగడం గమనార్హం. ఏడేండ్లలోనే దాదాపు మూడురెట్ల అభివృద్ధి. ఇది తెలంగాణ మాత్రమే సాధించిన ఘనత.