హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. బుధవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ వేలంలో స్థలాల కొనుగోలుకు రియల్ వ్యాపారులు పోటీపడ్డారు. అత్యధికంగా గజం రూ.1.11 లక్షల ధర పలికింది. రంగారెడ్డి జిల్లాలో మూడు, మేడ్చల్ -మలాజిగిరి జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో రెండు ల్యాండ్ పార్సిల్స్ కలిపి మొత్తం 9 చోట్ల భూములను విక్రయించడం ద్వారా రూ.195.24 కోట్ల రెవెన్యూ వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ఈ భూములకు హెచ్ఎండీఏ నిర్ణయించిన రూ.రూ.146 కోట్ల అప్సెట్ ధర మేరకు పారదర్శకంగా ఆన్లైన్ వేలం నిర్వహించగా, మొత్తం 32,730 చదరపు గజాల స్థలాలకు రూ.195.24 కోట్ల ఆదాయం సమకూరింది. రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడ, గండిపేట, కోకాపేటలో వేలం నిర్వహించగా, కోకాపేటలోని 1,852 గజాల భూమికి అత్యధికంగా గజం రూ.1.11లక్షలు పలికిందని సమాచారం. మేడ్చల్ జిల్లా పరిధిలోని మూసాపేటలో 4,840 గజాలకు సుమారు రూ.35 కోట్లు మేర ధర పలికినట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించిన ఆన్లైన్ వేలం పోటాపోటీగా జరిగింది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 12,584 చదరపు గజాలు, మేడ్చల్-మల్కాజిగిరిలో 12,160 చదరపు గజాలు, సంగారెడ్డిలో 7,986 చదరపు గజాలు భూమిని ఈ వేలంలో విక్రయించారు. రెండో దశ ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.