HomeTelanganaThe Death Knell Is Heard In The Cowshed Of The Rajanna Temple
రాజన్న కోడెల మృత్యుఘోష
రాజన్న ఆలయ గోశాలలో మరణమృదంగం వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ పట్టింపులేమితో మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లుతూ తనువుచాలిస్తున్నాయి. షెడ్డు సామర్థ్యానికి మించి కోడెలను కట్టేయడంతో తరచూ తొక్కిసలాట జరుగుతుండటం, మరోవైపు సరిపడా మేత, దాణా అందించకపోవడంతో బక్కచిక్కి నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
ఎనిమిది కోడెల మృత్యువాత
గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో ఖననం
అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న మూగ జీవాలు..!
నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాతపడుతున్న కోడెలు
షెడ్డు సామర్థ్యానికి మించి కోడెలు
మేత లేకపోవడమూ కారణమే
వేములవాడ, మే 30: రాజన్న ఆలయ గోశాలలో మరణమృదంగం వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ పట్టింపులేమితో మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లుతూ తనువుచాలిస్తున్నాయి. షెడ్డు సామర్థ్యానికి మించి కోడెలను కట్టేయడంతో తరచూ తొక్కిసలాట జరుగుతుండటం, మరోవైపు సరిపడా మేత, దాణా అందించకపోవడంతో బక్కచిక్కి నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. తాజాగా శుక్రవారం 8 జీవాలు మృత్యువాతపడగా, గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేయడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఘటనపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి.. పూర్తి వివరాలు అందజేయాలని, తక్షణమే వైద్య సేవలు అందించాలని ఆదేశించడంతో పశువైద్యాధికారుల బృందం రంగంలోకి దిగి, విచారణ చేపట్టింది. జీవాల మృతికి కారణాలను విశ్లేషించడంతోపాటు అనారోగ్యంగా ఉన్నవాటికి వైద్యం చేస్తున్నది.
పరిమితికి మించి కోడెలు.. అంతంతే మేత
రాజన్న భక్తులు కోరిన కోరెలు తీరితే స్వామివారికి నిజ కోడెను సమర్పించుకుంటామని మొకుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భక్తులు కోడెలను తీసుకువచ్చి రాజన్న ఆలయానికి అప్పగిస్తుండగా, వాటిని అధికారులు తిప్పాపూర్ గోశాలలో సంరక్షిస్తుంటారు. రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలను అవసరమైన రైతులకు కొన్నేండ్లుగా అందజేస్తూ వస్తున్నారు. ఆరు నెలల క్రితం కోడెల పంపిణీలో అవకతవకలు జరగడం, ఒకే వ్యక్తికి 60 జీవాలు అందించడం వివాదాస్పదం కావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో గోశాలకు భక్తులు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండగా, గోశాల ఇరుగ్గా మారిపోయింది.
ఇక్కడ 400 నుంచి 500 కోడెలను సంరక్షించే స్థలం, అందుకు తగ్గట్టుగానే వసతులు ఉండగా, ప్రస్తుతం 1,250కిపైగా కోడెలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. పరిమితికి మించి రాజన్న కోడలు సంరక్షిస్తుండటంతో తరచూ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇటీవల వర్షాలతో గోశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు, మోతాదుకు తగ్గట్టుగా పశుగ్రాసం అందకపోవడంతో నీరసించి మృతిచెందుతున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. నిత్యం 400 కోడెలకు మాత్రమే పచ్చి గడ్డిని అందిస్తున్నట్టు తెలుస్తుండగా, అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోశాలలో రోజూ పదుల సంఖ్యలో కోడెలు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తున్నారు.
రైతులకు పంపిణీ చేస్తాం
రాజన్న ఆలయ కోడెలను నిజమైన, అవసరమైన రైతులకే నేరుగా అందించేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయానికి నివేదించి, సంప్రదింపులు చేస్తున్నాం. జియో ట్యాగింగ్ చేసి పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీటిపై అధ్యయనం జరుగుతున్నది. త్వరలోనే పంపిణీ మొదలుపెడతాం.