హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/ఇచ్చోడ: ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన మరుక్షణమే తెలంగాణ సరిహద్దుల్లో సంచలనం మొదలైంది. తమను తెలంగాణలో కలపాలని సరిహద్దు గ్రామాలు నినదించాయి. మహారాష్ట్రలోని మహారాజ్గూడ, నెక్వాడ తదితర 14 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకూ కావాలని నినదించారు. తెలంగాణ తరహా పథకాలు కావాలని ఎన్నిసార్లు కోరినా మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్ వంటి పథకాలను అమలుచేస్తున్నదని, ఇలాంటివి తమ రాష్ట్రంలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలోని సాధారణ ప్రజలే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. మరోవైపు కిన్వట్ నియోజకర్గంలోని పాటోదా గ్రామస్థులు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామాన్ని సందర్శించిన పాటోదా గ్రామస్థులు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ నేపథ్యంలోనే బుధవారం పాటోదా గ్రామకూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తామంతా బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడుతామని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఉత్తంరావు, బిక్కు నాగోరావు, ఉమాజి కెరలె, గోపీనాథ్, సురొసె తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కొండాపూర్లో రైతులు, మహిళా రైతులు, కూలీలు వరి నారుతో బీఆర్ఎస్ అక్షరాలు రాసి తమ అభిమానం చాటుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ బెలూన్లు ప్రదర్శించారు. ‘రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ సార్.. ఇప్పుడు దేశ బాగు కోసం కదిలిండు. దేశంలోని రైతులందరికీ మేలు చేసేందుకు ముందుకుపోతున్నడు. అందుకే ప్రేమతో బీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నాం’ అని పలువురు రైతులు పేర్కొన్నారు.
పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు గతంలో అనేక సందర్భాల్లో తమను తెలంగాణలో కలపాలని కార్యాక్రమాలు చేపట్టిన ఉదంతాలు ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఉదహరణలు..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని 42 గ్రామాలు నాలుగేండ్లుగా తమను తెలంగాణలో కలపాలని ధర్మపోరాటం చేస్తున్నాయి. సామాజిక కార్యకర్త శంకర్ పటేల్ హొట్టె ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ధర్మాబాద్ తాలూకాలోని 35 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2019 జనవరి 3న దీక్ష చేశారు. ‘హమారేకో తెలంగాణమే మిలాలో’ అంటూ ఉద్యమం చేశారు. ధర్మాబాద్ తాలూకా నుంచి సర్పంచ్ల ప్రతినిధి బృందం బాసరకు వచ్చి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ 2021న జూన్ 14న డిమాండ్ చేశారు. రాయచూర్ సమస్యలను కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అద్భుతంగా అమలుచేస్తున్నదని కీర్తించారు. ‘తెలంగాణ తరహా పథకాలు అమలు చేయండి.. లేదంటే మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు. తెలంగాణలో చాలా మంచి పథకాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మనిషికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నది. ఆసరా పింఛన్లు ఇస్తున్నది. మహారాష్ట్రలో ఇంత మంచి కార్యక్రమాలు లేవు. అందుకే ఎప్పుటి నుంచో మేం తెలంగాణలో కలవాలని కోరుతున్నాం.
-విజయ్, నెక్వాడ గ్రామస్థుడు, మహారాష్ట్ర
తెలంగాణ తరహా పథకాలు, సౌకర్యాలు కావాలని మా గ్రామస్థులు కోరుతున్నారు. మహారాష్ట్ర కంటే తెలంగాణలో మంచి పథకాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు సుఖంగా ఉన్నారు. అలాంటి పథకాలు మాకూ కావాలి. మా గ్రామాన్ని తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
-సుధాకర్ జాధవ్, నెక్వాడ డిప్యూటీ సర్పంచ్, మహారాష్ట్ర