హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దళితుల సముద్ధరణ, సాధికారత ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం 36 వేల మైలురాయిని దాటింది. పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పు న అందజేసి, ఆయా కుటుంబాలు తమకు నచ్చిన, నైపుణ్యం కలిగిన జీవనోపాధిని ఎంచుకొనే స్వేచ్ఛను కల్పించింది.
మొత్తంగా దళితబంధు కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 36,392 మంది లబ్ధిదారుల ఖా తాల్లో ప్రభుత్వం నిధులు జమచేయగా, వారి లో 31,088 మంది యూనిట్లను ఏర్పాటు చేసుకొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 18,211 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,822 కోట్లను జమచేసింది. అందులో ఇప్పటివరకు 15,402 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో 75 మంది లబ్ధిదారులకు రూ.7.50 కోట్లు జమచేయగా 100 శాతం గ్రౌండింగ్ పూర్తయింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొన్న చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో వంద శాతం దళిత కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం మొత్తంగా 8,518 మందిని గుర్తించింది.
వారిలో 6,947 మంది బ్యాంకు ఖాతాలకు నిధులు జమచేయగా, ఇప్పటివరకు 4,808 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. తదుపరి రాష్ట్రవ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తంగా 11,835 లబ్ధిదారులను గుర్తించింది. ఇందులో 11,159 ఖాతాల్లో నిధులు జమచేసింది. అందులో 10,893 యూనిట్ల ఏర్పాటు పూర్తయింది.
దళితబంధు పథకాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఆ నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నది. ఈ సంవత్సరం ఒక్కొక్క నియోజకవర్గంలో 1,500 కుటుంబాల చొప్పున మొత్తంగా 1,77,00 మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నారు. మొదటి దశలో నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తంగా 59 వేల మందికి మంజూరు చేయాలని ఇటీవల క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దళితవర్గాలు, మేధావులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
దళితబంధు పథ కం నిర్దేశిత లక్ష్యం దిశగా పరుగులు తీ స్తున్నది. దీని ద్వా రా బహుముఖ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలె. ప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షలను రెట్టింపు చేయాలి. దళితులందరూ ఆర్థికాభివృద్ధిని సా ధించాలి. ఇదే సీఎం కేసీఆర్ సంకల్పం. నియోజకవర్గానికి 500 చొ ప్పున యూనిట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కొప్పుల ఈశ్వర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి
దళితులను పేదరికం నుంచి దూరం చేసి, వారిని ప్రగతిపథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. కొత్తగా ప్రతి నియోజకవర్గానికి 500 మందికి దళితబంధు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు దళిత సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. పథకాన్ని దళితులందరూ సద్వినియోగం చేసుకొంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చాలి.
-బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్