హైదరాబాద్, జనవరి24 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాలను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణపై పూర్తిస్థాయి అధ్యయనం కోసం ఈ బృందం త్వరలో తగు సిఫారసులు చేయనున్నది.
ఆర్డీఎస్ ద్వారా నిర్దేశిత కేటాయింపుల మేరకు సాగునీరు రావడం లేద ని ప్రభుత్వం చాలా కాలం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆనకట్ట ఎత్తును పెంచడంతోపాటు హెడ్రెగ్యులేటరీలు, కాలువల ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని డిమాండ్ చేస్తున్నది.సుంకేశులకు నీరు రావడం లేదని ఏపీ సైతం ఫిర్యాదు చేయడంతో ఆర్డీఎస్పై సమగ్ర అధ్యయనం చేయించాలని 16వ సమావేశంలో కేఆర్ఎంబీ నిర్ణయించింది.
ఆ బాధ్యతను పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు అప్పగించేందుకు ఇటీవల సంప్రదింపులు జరపడంతోపాటు సంబంధిత మార్గదర్శకాలను సైతం నిర్ధేశించింది. ఈ అధ్యయనానికి రూ.24 లక్షలు ఖర్చవుతుందని సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రాథమిక అంచనాను సమర్పించింది. అయితే ఆర్డీఎస్ను క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాణాత్మక నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ కోరింది. ఈ నేపథ్యంలో ఇటీవల క్షేత్రస్థాయిలో ఆనకట్టను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇంజినీర్లు ఐజాక్, కుంజీర్, కేఆర్ఎంబీ ఇంజినీర్ శివశంకర్ త్వరలో తమ అంచనా నివేదికను సమర్పించనున్నట్టు తెలిసింది.
9న తుంగభద్ర బోర్డు సమావేశం
తుంగభద్ర రివర్ బోర్డు 221వ సమావేశాన్ని ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం సమాచారం అందించారు. ఏపీ విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది బోర్డు సమావేశాన్ని విశాఖలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.