ధరూరు, జూలై 3: ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడంతో సర్కార్ స్కూళ్లకు క్రేజ్ పెరిగింది. బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పాఠశాలలు పునఃప్రారంభమైన 20 రోజుల్లోనే చాలా పాఠశాలల్లో ప్రవేశాలు నిండిపోతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పది రోజుల కిందటే అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. సోమవారం ధరూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య నిండిపోయింది.
హెచ్ఎం నాగేటి ప్రతాపరెడ్డి పాఠశాల గేట్ వద్ద నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే 75 నుంచి 105 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని హెచ్ఎం తెలిపారు. తరగతి గదులు పూర్తిగా నిండిపోయాయని, బెంచీలు సరిపోవడం లేదని, విద్యార్థులు పరిమితికి మంచి చేరారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 1,100 మంది విద్యార్థులు ఉన్నారని, అందుకే కొత్తగా అడ్మిషన్స్ తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.