హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక అదే గవర్నర్లను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడింది. సీపీఐ బుధవారం చేపట్టిన ‘చలో రాజ్భవన్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు యత్నించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి సహా వందలాది సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఉదయం 10.30 గంటలకే భారీ ఎత్తున సీపీఐ కార్యకర్తలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రాజ్భవన్ వైపునకు నిరసన ప్రదర్శనగా బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు-నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. అంతకుముందు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. రాజ్భవన్ను బీజేపీ భవన్గా మార్చారని, ఆమె బీజేపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీ 2013లో గవర్నర్ వ్యవస్థతో ఉపయోగం లేదని అప్పటి లోకాయుక్తకు లేఖరాశారని గుర్తు చేశారు. శాసనసభ అమోదించిన బిల్లులను అమోదించకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లు పాలనలో అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. సరారియా కమిషన్ గవర్నర్ వ్యవస్థ అనవసరని నివేదిక ఇచ్చిందని తెలిపారు. బ్రిటిష్ పాలకులు వదిలేసిన అవశేషమే గవర్నర్ వ్యవస్థ అని మండిపడ్డారు.
పదవీ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమాలకు తప్ప గవర్నర్ వ్యవస్థ దేనకీ పనికిరాకుండా పోయిందన్నారు. అది మానవ శరీరంలో పనికిరాని అపెండెక్స్ వంటిదన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని కూనంనేని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేసేంత వరకు పోరాటాలు ఆగవని హెచ్చరించారు.