హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు హైకోర్టును ఆశ్రయించిన 192 మంది పిటిషనర్లను కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆ పరీక్షల ఫలితాలను వెల్లడించరాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీఈడీ పూర్తిచేసిన తమను పీడీ పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరుతూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తికి చెందిన ఆర్ శ్రీను మరో 191 మంది వేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది.