హైదరాబాద్ : పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 27 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
ఈ ప్రమాద మృతుల్లో రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు కూడా ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్రెడ్డి, ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్య రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాడ మాసం తర్వాత బంధుమిత్రులను ఆహ్వానించి పెద్దల సమక్షంలో ఘనంగా వేడుకలు జరుపుకుందని అనుకున్నారు.
కానీ ఇంతలో విధి వక్రించింది. సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పేలుడు ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.