హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంతో దేశానికి బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ రాక కోసం దేశం ఎదురు చూస్తున్నదని తెలిపారు. బీజేపీ పాలనతో దేశం అన్నింటా అట్టడుగుకు వెళ్లిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశమంతా రావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని స్పష్టంచేశారు. దేశమంతా ఉచిత విద్యుత్తు కావాలని రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ విజన్, కేసీఆర్ డైనమిజం దేశానికి అవసరమని పేర్కొంటున్నారు.
తెలంగాణ మాడల్.. దేశానికి అవసరం
నరేంద్ర మోదీ పాలనలో దేశం రోజురోజుకు దిగజారుతున్నది. పన్నుల రూపంలో సామాన్యులను కోలుకోలేని దెబ్బతీశారు. ఎనిమిదేండ్లలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టడం కోసమే మోదీ తాపత్రయపడ్డారు. బీజేపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితి, ప్రస్తుతం దేశంలో నెలకొన్నది. తెలంగాణ సాధించి కేసీఆర్ ప్రజల జీవితాలనే మార్చేశారు. ప్రస్తుతం దేశమంతా ఆ మార్పు కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. తెలంగాణలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతా కావాలని జాతిజనం కోరుకుంటున్నది. అందుకే.. తెలంగాణ మాడల్ దేశమంతా రావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ప్రజలకు ఎంతో అవసరం.
– నీలం రవి, వ్యాపారవేత్త, బహ్రెయిన్
కేసీఆర్ చరిత్ర సృష్టించడం పక్కా
మాది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు. నేను అవాంజ్ మరీనాలో ఆపరేషన్ మేనేజర్గా పనిచేస్తున్నా. ఎక్కడున్నా సీఎం కేసీఆర్ వేసే అడుగు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటాం. తెలంగాణ మాదిరి దేశమంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. దేశంలోని అన్ని వర్గాలకు చెందినవాళ్లు తెలంగాణలోని అభివృద్ధి తమకూ కావాలని కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే విజయం పక్కా. ఒకప్పుడు పీవీ నరసింహారావు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కేసీఆర్ చరిత్ర తిరగరాస్తారు. తెలంగాణ ఆత్మ గౌరవ నినాదంతో ఉద్యమం చేసిన కేసీఆర్.. ఇప్పుడు దేశంలోనూ అదేస్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. మేం ఎక్కడున్నా కేసీఆర్ వెంటే నడుస్తాం. ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాం.
– కోటగిరి నవీన్ కుమార్, బహ్రెయిన్
దేశానికి కేసీఆర్లాంటి ఖలేజా ఉన్న నేత కావాలి
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్ వంటి ఖలేజా ఉన్న నేత జాతీయ రాజకీయాల్లోకి రావడం అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రంతో దేశ భవిష్యత్తే మారబోతున్నది. ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశమంతా వ్యాపించబోతున్నది. నాడు తెలంగాణలో సాగు నీరు, కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డారు. ప్రస్తుతం బీడు భూముల్లో బంగారం పండుతున్నది. చీకట్లలో మగ్గిన పల్లెలు వెలుగులతో నిండిపోయాయి. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందుతున్నది. తెలంగాణలో రైతు జీవితమే మారిపోయింది. భూముల రేట్లు ఆకాశానికి అంటాయి. దేశంలోని రైతులందరూ కేసీఆర్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్తో దేశంలోని రైతుల బతుకుల్లో వెలుగులు నిండటం ఖాయం.
– షరాన్ రాజ్ కైత, హెచ్ఎస్ఎస్ఈ అడ్మినిస్ట్రేటీవ్ కో ఆర్డినేటర్, బహ్రెయిన్
కేసీఆర్తో దేశంలో సుపరిపాలన
మోదీ పాలనలో దేశం దుర్భిక్షంగా మారుతున్నది. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెడితే.. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. రాష్ర్టాల్లో ప్రభుత్వాలని విచ్ఛిన్నం చేయడం, ఎవరైనా ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐల పేరుతో బెదిరింపులకు దిగడమే మోదీ అజెండాగా మారింది. మత విద్వేషాలను రగిలించి, ప్రజల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ సిద్ధాంతంగా మార్చుకున్నది. ప్రస్తుతం దేశంలో మోదీని ఎదుర్కొనే ఒకే ఒక్క నేత కేసీఆర్ మాత్రమే. అందుకే దేశమంతా కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నది. బీజేపీ వ్యతిరేక శక్తులు, మేధావులు, వివిధ పార్టీల నేతలు అందరూ కేసీఆర్ను ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ రాకతో దేశంలో సుపరిపాలన వస్తుంది. ప్రజల జీవితాల్లో సంతోషం నిండుతుంది.
– పులి వినీష్, వర్క్ సూపర్వైజర్, బహ్రెయిన్
కేసీఆర్తో దేశమంతా ఉచిత విద్యుత్తు
దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దేశాభివృద్ధి మాతోనే సాధ్యమని చెప్పుకొనే ఎన్నో రాష్ర్టాల్లో ప్రస్తుతం పవర్ హాలిడేలు ఇస్తున్నారు. గంటల కొద్దీ కరెంట్ కోతలు విధిస్తున్నారు. పొలాలు ఎండిపోతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. కానీ, ప్రస్తుతం తెలంగాణలో పవర్ హాలిడేలు లేవు. కరెంట్ కోతలు లేవు. పొలాలు ఎండిపోవడం లేదు. రైతు ఆత్మహత్యలు లేవు. వీటన్నింటికీ కారణం కేసీఆర్ విజనే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించే ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణే. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేశారు. రైతుల గురించి ఎంతగానో ఆలోచించే గొప్ప మనసున్న నేత కేసీఆర్. కేసీఆర్తోనే దేశమంతా ఉచిత విద్యుత్తు సాధ్యం. – వినయ్ కుమార్, డాక్యుమెంట్ కంట్రోల్ ఆఫీసర్ (బహ్రెయిన్)
కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నేత ప్రస్తుతం దేశ రాజకీయాలకు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను వేధిస్తున్నది. కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తూ భయపెట్టాలని చూస్తున్నది. దేశంలో అరాచక పాలన సాగుతున్నది. బీజేపీ సర్కారు విభజన రాజకీయాలతో దేశానికి నష్టం జరుగుతున్నది. మనది ప్రజాస్వామ్య లౌకిక దేశం. మత రాజకీయాలు దేశానికి అరిష్టం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ వంటి పాలనాదక్షుడు, మేధావి దేశానికి ఎంతైనా అవసరం. తెలంగాణలో అన్ని కులాలు, మతాలను సీఎం కేసీఆర్ సమానంగా ఆదరిస్తున్నారు. దేశంలోని గౌడ సంఘ అనుబంధ సంస్థలు సైతం తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రశంసిస్తున్నాయి. ఇలాంటి గొప్ప నాయకుడు దేశ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.
-పల్లె లక్ష్మణ్రావుగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (అమీన్పూర్-సంగారెడ్డి జిల్లా)