జగిత్యాల టౌన్, అక్టోబర్ 7: మోదీ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమనం వైపు పయనిస్తున్నదని, ఈ దశలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. 21 ఏండ్ల క్రితం టీఆర్ఎస్ను స్థాపించి ఉద్యమపంథాలో రాష్ర్టాన్ని సాధించిన ఆయన అనతికాలంలోనే రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందునిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఇదేతరహాలో ఆయన నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు.
బీఆర్ఎస్ ఏర్పాటును దేశప్రజలు స్వాగతిస్తుంటే అవగాహన లేని కొందరు ప్రతిపక్ష నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. టీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన సందర్భంలోనూ ఇదేవిధంగా మాట్లాడారని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ వారి విమర్శలను, అవహేళనలను లెక్కచేయకుండా అనుకున్నది సాధించారని పేర్కొన్నారు. మోదీ సర్కారు హామీల అమలులో విఫలమైందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సైతం ఉపయోగించుకోలేకపోవడంతో దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిపోయిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మాడల్ కావాలని దేశప్రజలు కోరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.