హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు చేపట్టాలని అఖిల భారత కిసాన్సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎస్ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని అమలు చేయటం లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ఈ బడ్జెట్లో ఏ రకమైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. పైగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా ఫిబ్రవరి 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కేంద్ర బడ్జెట్ ప్రతులు, దిష్టిబొమ్మల దహనం, ప్రదర్శనలు, సభల రూపంలో నిరసనలు వ్యక్తం చేయాలని తెలిపారు. సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు హన్నన్ మొల్ల, విజయ్కుమార్, అమల్హల్దా, అమ్రరాం, ఎస్కే ప్రీజ, షణ్ముగం, బిప్లవ్ మజుందార్, ఇంద్రజిత్, కోశాధికారి కృష్ణప్రసాద్, సహాయ కార్యదర్శులు టీ సాగర్, బాదల్ సరోజ్, విల్సన్ పనోలి, ముకుత్సింగ్, రవీంద్రన్, డాక్టర్ అజిత్ నవలే, అవధేశ్ కుమార్, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.