హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత మెమోల స్థానంలో స్మార్ట్ చిప్ ఆధారిత మెమోలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా స్మార్ట్ చిప్లను నిక్షిప్తంచేసిన సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఇటీవలే నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సిస్టంను (ఎస్ఏవీఎస్)ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. 2010 నుంచి 2021 వరకు గల విద్యార్థుల డాటాను ఈ పోర్టల్లో పొందుపరిచారు. దీనికి కొనసాగింపుగా చిప్ ఆధారిత మెమోలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న భావనతో అధికారులు కసరత్తును వేగవంతం చేశారు.
పరిస్థితులు అనుకూలిస్తే ఈ విద్యాసంవత్సరం లేదా వచ్చే విద్యాసంవత్సరం నుంచి చిప్ ఆధారిత మెమోలను అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్సిటీల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు పలు సెక్యూరిటీ ఫీచర్లు గల మెమోలను అందజేస్తున్నారు. వర్సిటీ లోగో, వాటర్మార్క్, ఎక్కువ మందం గల పేపర్ను వినియోగించడం వంటి సెక్యూరిటీ ఫీచర్లను వినియోగిస్తున్నారు. అయినా కూడా ఫేక్ సర్టిఫికెట్లకు అడ్డుకట్టపడట్లేదు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పాస్పోర్ట్ తరహా స్మార్ట్చిప్ బేస్డ్ మెమోలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఐటీశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై త్వరలో మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్తో భేటీ కానున్నారు.