కన్న బిడ్డల ఆకలి చూడలేక.. తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య నీళ్లు తాగి పస్తులతో పడుకోవడాన్ని చూసి తట్టుకోలేక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మనసును చంపుకొని దొంగగా మారి వారి ఆకలి తీరుస్తుంటాడు పాత సినిమాల్లో ఓ హీరో..
ఇప్పుడు కరోనా పాపమా అని ఓ ఉద్యోగి బతుకు సినిమాలా మారింది. పిల్లలు, కుటుంబసభ్యుల ఆకలితీర్చడానికి ఏ మార్గం దొరక్క దొంగగా మారాడు. అలవాటులేని విద్యాయె.. 24 గంటల్లోనే దొరికిపోయాడు. చివరకు జైలుపాలయ్యాడు. ఇతని దీనగాథ తెలుసుకుని ఓ పోలీస్ సాయం చేయడంతో మొత్తానికి బయటపడ్డాడు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగి.. నిరుద్యోగి.. దొంగ.. ఖైదీ.. నాలుగు నెలల్లోనే కరోనా వైరస్ ఓ మధ్యతరగతి వ్యక్తిని ఛిన్నాభిన్నం చేసిన తీరిది. ఓ కుటుంబం కన్నీటి గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. పదిహేనేండ్ల కిందట ఒడిశా నుంచి బీఎస్సీ డిగ్రీ పట్టుకుని ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. విద్యార్హతతో ఫార్మా కంపెనీ ల్యాబ్లలో పనిచేశాడు. భార్య, ముగ్గురు సంతానం, తల్లిదండ్రులను సంతోషంగా చూసుకున్నాడు. అంతా కలిసి ఆనందంగా ఉన్నారు. కానీ, కరోనా ఆ కుటుంబాన్ని ఒక్క కుదుపు కుదిపింది. వైరస్ దెబ్బకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతని ఉద్యోగం పోయింది. చాలాచోట్ల ఉద్యోగం కోసం తిరిగినా.. కరోనా కారణంగా ఉద్యోగం ఇవ్వలేమని జవాబు వచ్చింది.
కొద్దిగా జమచేసుకున్న డబ్బుతో సంసారాన్ని గుంజుకొచ్చాడు. ఆ తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇంట్లో సరుకులు అయిపోయాయి. భార్య, భర్త పస్తులుండి పిల్లలకు, వృద్ధ తల్లిదండ్రులకు భోజనం అందేలా చూశారు. ఆ తర్వాత ఇంకా దయనీయ స్థితికి రావడంతో అందరూ ఒకపూట మాత్రమే కొద్దికొద్దిగా భోజనం చేయాల్సి వచ్చింది. పిల్లలు ఆకలి అంటూ ఏడ్వడం మొదలుపెట్టారు. వృద్ధ తల్లిదండ్రులు.. కుమారుడి కష్టం చూడలేక తమ కడుపును మార్చుకున్నారు. చేతుల్లో చిల్లి గవ్వలేదు. పిల్లలు ఏది అడిగినా తలవంచుకోవాల్సిన పరిస్థితి. సంప్రదాయ కుటుంబంనుంచి రావడంతో ఆ కట్టుబాట్లను దాటలేకపోయాడు. అప్పు ఇచ్చేవారు దరిదాపుల్లో కనిపించలేదు.
రోజురోజు పరిస్థితి దిగజారుతుంది. ల్యాబ్లో పనిచేసే అనుభవం తప్పా మరో పని చేయలేకపోవడంతో కుటుంబం దీని స్థితికి వచ్చేసింది. మూడు నాలుగు నెలలు గడిచిపోయింది. ఓ రోజు హెల్మెట్ పెట్టుకొని ఇంటినుంచి బయలుదేరాడు. పక్క కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాగేసుకుని ఇంటికి వచ్చేశాడు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేసి స్నాచింగ్కు పాల్పడిన ఆ వ్యక్తిని 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి.. పట్టుబడ్డ వ్యక్తి దొంగగా మారడానికి కారణాలపై ఆరాతీశారు. ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను స్నాచర్ వివరించాడు. వెంటనే ఆ అధికారి స్వయంగా అతని ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులు, పిల్లలను చూశారు.
విద్యార్హత, అనుభవ పత్రాలను పరిశీలించారు. చట్టపరంగా ఏ సహాయం చేసే పరిస్థితి లేకపోవడంతో అతన్ని రిమాండ్చేశారు. కానీ, ఎలాగైనా స్నాచర్ను మార్చాలని ఆ పోలీస్ అధికారి భావించారు. ఆ స్నాచర్కు వ్యక్తిగతంగా బెయిల్ ఇప్పించారు. అతని కుటుంబానికి నాలుగు నెలలు సరిపడా రేషన్ను అందజేశారు. మరోసారి పరిస్థితులకు తలొగ్గి నేరాలకు పాల్పడొద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబాన్ని సముదాయించి అతన్ని మరింత చులకనగా చూడొద్దని కోరారు. త్వరలో అతనికి ఉన్న అర్హతతో ఉద్యోగం వచ్చేలా ఆ ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చారు. పోలీసు అధికారి చూపిన ఔదార్యం ఇప్పుడు ఆ కుటుంబాన్ని గట్టు మీదకు తీసుకొచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల కిందట చోటుచేసుకొన్నది.