ఎల్లారెడ్డిపేట, జనవరి 26: కరోనా పాజిటివ్తో డెలివరీకి వచ్చిన గర్భిణికి పురుడు పోసి ఇద్దరి ప్రాణాలు నిలిపి ఆదర్శంగా నిలిచారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పీహెచ్సీ సిబ్బంది. వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన లకావత్ రజిత తొమ్మిది నెలల గర్భిణి. గత సోమవారం సాధారణ చెకప్ కోసం సిరిసిల్ల జిల్లా దవాఖానకు తీసుకెళ్తే అక్కడ కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైద్యులు అడ్మిట్ కావాలని సూచించినా ఆమె ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం రజితకు నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె నొప్పులతో తల్లడిల్లుతున్నారు. సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు కూడా తరలించే వీలు లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఏఎన్ఎంలు పుష్పలత, సుజాత, కీర్తి మానవత్వాన్ని చాటారు. డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ కపిల్సాయి, వైద్యాధికారి ధర్మానాయక్కు పరిస్థితి వివరించి తామే పురుడు పోస్తామని అనుమతి తీసుకొన్నారు. ధైర్యంగా రజితకు నార్మల్ డెలివరీ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏఎన్ఎంల చొరవను, ధైర్యాన్ని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు ట్విట్టర్ ద్వారా అభినందించారు. కాగా రజిత కుటుంబ సభ్యులు సైతం ఏఎన్ఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.