తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే షడ్యంత్రం కేసీఆర్ అప్రమత్తతతో పటాపంచలైంది. అయితే ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడిన బ్రోకర్లు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ సాధారణ వ్యక్తులేమీ కాదు. దేశంలోని అత్యున్నత వ్యక్తులతో వారికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ అధికార ప్రాంగణాల్లో యథేచ్ఛగా తిరుగాడే వ్యక్తులు వాళ్లు. వారితో తమకేమీ సంబంధం లేదని బీజేపీ ఎంత బుకాయిస్తున్నా.. కమల్ ఫైల్స్ ఉదంతంలో వెలుగుచూస్తున్న అనేక ఆధారాలు నిజాల్ని కండ్లకు కడుతూనే ఉన్నాయి.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లీడర్లతో నిందితులు ముగ్గురూ నిరంతరం సంపర్కరంలో ఉన్నారని తెలుస్తున్నది. ఎప్పుడంటే అప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్లగలిగిన చనువు, స్నేహం వారికి ఉన్నాయని వివిధ సందర్భాల్లో ముఖ్యనేతలతో దిగిన ఫొటోలే స్పష్టం చేస్తున్నాయి. పలు రాష్ర్టాల్లో ఆపరేషన్లు చేపట్టామని, అత్యున్నత వ్యక్తులే తమ వెనుక ఉన్నారని వాళ్లు వీడియో రికార్డింగ్లోనూ అంత ధైర్యంగా చెప్పగలిగారంటే వారిని నడిపించిన అదృశ్య హస్తాలు ఎంత శక్తిమంతమైనవో అర్థమవుతున్నది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు ఇద్దరినీ ఈ ఫొటోలో చూడొచ్చు. నందకుమార్ అలియాస్ నందు, రామచంద్రభారతిల పరిచయం ఇప్పటిదికాదు. చాలా ఏండ్లుగా వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతున్నది. ఆ బంధమే వారిని ప్రభుత్వాన్ని కూల్చే పన్నాగంలో పావులుగా మార్చింది. తన నివాసానికి వచ్చిన రామచంద్రభారతితో నందకుమార్ దంపతులు..
ఫొటోలో రామచంద్రభారతితో ముచ్చటిస్తున్న ఈమె సాధ్వీ ప్రాచి. కమల్ ఫైల్స్లో బయటపడిన ఆధారాల్లో సాధ్వీ ప్రాచి పేరు కూడా వినిపించింది. వీహెచ్పీలో సభ్యురాలైన ప్రాచి.. బీజేపీ తరఫున రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ మేరకు పార్టీ పెద్దలను ఒప్పించాలని కోరుతూ రామచంద్రభారతిపై ఆమె ఒత్తిడి కూడా తెచ్చింది. ఎంపీ సీటు ఇప్పించే స్థాయిలో ఆర్సీబీ ఉన్నారనడానికి ఇదో ఉదాహరణ.
రామచంద్ర భారతి, జగ్గుస్వామి.. ‘కమల్ ఫైల్స్’ ఉదంతంలో తరుచూ వినిపిస్తున్న పేర్లు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో అడ్డంగా దొరికిపోయిన రామచంద్రభారతి.. కొనుగోలుకు అవసరమైన విటమిన్-ఎం (డబ్బుల) కోసం కేరళకు చెందిన జగ్గుస్వామితో సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలు బయటకు వచ్చాయి. పలువురు బీజేపీ ప్రముఖులు ఉన్న ఈ ఫొటోలో కుడివైపు నుంచి మొదటి వ్యక్తి ఆర్సీబీ కాగా, మూడో వ్యక్తి జగ్గుస్వామి.
యోగి ఆదిత్యనాథ్.. యూపీ ముఖ్యమంత్రి. మోదీ, అమిత్షా తర్వాత బీజేపీలో ఆ స్థాయిలో చెలామణి అవుతున్న నేత. ఆయనతోనూ రామచంద్ర భారతి స్వామికి సత్సంబంధాలున్నాయి. యోగి-స్వామి బంధం ఆధ్యాత్మికానికే పరిమితం కాలేదని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. పొలిటికల్ తెరపైనా వారి పరిచయం తక్కువదేమీ కాదు. వారిద్దరి సాన్నిహిత్యం ఏ స్థాయిలో ఉందో ఫొటో చూస్తే అర్థమవుతున్నది.
కేంద్ర క్యాబినెట్లోని పలువురు మంత్రులతో రామచంద్రభారతికి పరిచయాలేకాదు, అంతకుమించి బలమైన సంబంధాలు ఉన్నాయి. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన అలవోకగా దిగిన ఫొటోలు పబ్లిక్ డొమైన్లో కోకొల్లలుగా అందుబాటులో ఉన్నాయి. బీజేపీ నేత, కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్తో.. సివిల్డ్రెస్లో ఉన్న ఆర్సీబీ స్వామిని ఈ ఫొటోలో చూడొచ్చు.
బాబా రామ్దేవ్.. యోగా గురువు మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత సన్నిహితుడు కూడా. 2014లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించాడు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తూ.. మోదీ అధికారంలోకి వస్తే దేశ దశ మారిపోతుందని ఆయన బహిరంగంగా వాఖ్యలు చేశారు. అలాంటి రామ్దేవ్ బాబాతో రామచంద్ర భారతి పరిచయాల స్థాయి చిన్నదేమీ కాదు.
కేంద్రప్రభుత్వ అధికారిక ప్రాంగణాల్లో తరుచూ కనిపించే వ్యక్తి ఆర్సీబీ. అటు బీజేపీ పెద్దలతోనూ, ఇటు కేంద్రమంత్రులతోనూ ఆయనకు సంబంధాలున్నాయి. ఆ పార్టీలో ఉన్నతస్థాయిలో రామచంద్రభారతిని గుర్తుపట్టని నేతలెవరూ ఉండరు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్, ప్రస్తుత కేంద్రమంత్రి సదానంద గౌడను ఆర్సీబీ కలిసిన ఓ సందర్భంలోనిదీ ఫొటో.
కేంద్రమంత్రి సదానంద గౌడ.. మోదీ క్యాబినెట్లో సీనియర్ మంత్రుల్లో ఒకరు. కర్ణాటకకు చెందిన ఈయన గత 8 ఏండ్లుగా కేంద్రమంత్రిగానే కొనసాగుతున్నారు. ఆయనతో రామచంద్రభారతి స్వామిని కాషాయదుస్తుల్లో ఇక్కడ చూడొచ్చు.
బీజేపీ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రామచంద్రభారతి భాగమయ్యారు. పలువేదికలపై ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. ఢిల్లీ బీజేపీ నేత, లోక్సభ ఎంపీ మనోజ్తివారీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో మరో స్వామీజీతో కలిసి ఆర్సీబీ..
మిమ్మల్ని కలవాలంటూ బీజేపీ బ్రోకర్ రామచంద్రభారతి ఆర్ఎస్ఎస్ అగ్రనేత దత్తాత్రేయ హొసబలెను అడిగారు. హరిద్వార్లోని జగద్గురు శంకరాచార్య ఆశ్రమంలో కలుద్దామంటూ హొసబలె ఆయనకు బదులిచ్చారు. హరిద్వార్లో ఆర్ఎస్ఎస్ బైఠక్ జరిగిన ఆ ఆశ్రమం ఇదే.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన నిందితులైన స్వాములిద్దరినీ ఇక్కడ చూడొచ్చు. రామచంద్రభారతి, సింహయాజి.. ఇద్దరూ పేరుకే కాషాయం కట్టిన స్వామీజీలు కానీ, వారు చేసేదంతా పొలిటికల్ బ్రోకర్ పనులే. బీజేపీ అసైన్మెంట్లకు అనుగుణంగానే తాము పనిచేస్తామని మొయినాబాద్ ఫాంహౌస్ ఆడియల్లో వీరు పలుమార్లు చెప్తుండటం స్పష్టంగా వినిపించింది. కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఎలా పడగొట్టామో, అందులో తమ పాత్ర ఎంత ఉందో వారు పూసగుచ్చినట్టు వివరించారు కూడా. తిరుపతిలో సింహయాజికి చెందిన శ్రీమంత్రరాజ పీఠానికి హైదరాబాద్లోనూ ఓ బ్రాంచి ఉంది. గతంలో అక్కడ ఆర్సీబీ, సింహయాజి కలుసుకున్నప్పటిది ఈ దృశ్యం
పురుషోత్తం కోడాభాయ్ రూపాలా.. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి. మోదీకి గుజరాత్ నుంచీ సహచరుడు. బీజేపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ఈయనకు మోదీ తన రెండో టరమ్లో మత్స్యశాఖ బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలోనూ, గుజరాత్లోనూ మాట చెల్లుబాటయ్యే నేత ఆయన. అలాంటి రూపాలాతో సింహయాజికి మంచి సంబంధాలున్నాయి. కేంద్రమంత్రిని ఆయన వ్యక్తిగతంగా కలిసినప్పటిదీ చిత్రం.
ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు కమల్ఫైల్స్ ఆడియోల్లోనూ వినిపించింది. కేంద్రం తలుచుకున్నందునే ఆయనకు వై-క్యాటగిరీ రక్షణ కల్పించామని నిందితులు అందులో తెలిపారు. ఏపీలోనూ ప్రభుత్వం కూల్చివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు స్పష్టంగా పేర్కొన్నారు. రఘురామకు బీజేపీ నేతలతో సత్సంబంధాలున్న నేపథ్యంలో కేంద్రం ఆయనకు 2020 ఆగస్టు నుంచి వై-క్యాటగిరీ భద్రత కల్పించింది. ఆర్ఎస్ఎస్ అగ్రనేత దత్తాత్రేయ హొసబలేతో రఘురామ కృష్ణంరాజు, రామచంద్రభారతి.
కేరళకు చెందిన తుషార్ వెల్లప్పల్లి పేరుకు ‘భారత ధర్మ జనసేన’ అనే పార్టీ నడుపుతున్నా.. చేసేదంతా బీజేపీ వ్యవహారాలను చక్కబెట్టడమే. గత ఎన్నికల్లో రాహుల్గాంధీపై ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన తుషార్కు అమిత్షాయే స్వయంగా బీ-ఫాం అందజేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు తుషార్తో సంభాషణలు సాగించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. గతంలో దిగిన ఈ ఫొటోచూస్తే.. తుషార్, నందకుమార్ సాన్నిహిత్యం అర్థమవుతున్నది.
తిరుపతికి చెందిన శేఖర్ సింహయాజి స్వామిగా మారి తనకంటూ ఓ పీఠం ఏర్పాటు చేసుకున్నారు. ఆధ్యాత్మికత కార్యక్రమాల వంకతో ఆయన రాజకీయ ప్రముఖులతో పరిచయాలను పెంచుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనిలో వందలకోట్ల బేరసారాలు సాగించే స్థాయికి చేరుకున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన నితిన్గడ్కరీకి గతంలో తన పీఠం తరఫున జ్ఞాపికను అందజేస్తున్న సింహయాజి..
ఈ ఫొటో చూస్తే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో జగ్గు స్వామికి ఎంత బలమైన సంబంధాలున్నాయో అర్థమవుతున్నది. రామచంద్ర భారతి- బీఎల్ సంతోష్-తుషార్- జగ్గుస్వామి.. ఓ నెట్వర్క్లో భాగమని తెలుస్తున్నది.
ఈ రెండు ఫొటోలనూ చూస్తే.. ఎమ్మెల్యేలకు ఎర నిందితులు చాలాకాలంగా కలిసి తిరుగు తున్నారని, కలిసి వ్యవహారాలను చక్కబెడుతున్నారని స్పష్టమవుతున్నది. అటు సింహయాజి, ఇటు నందకుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఒకేచోట కలిసినట్టు ఈ రెండు ఫొటోలు తేటతెల్లం చేస్తున్నాయి. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య వారధి గడ్కరీ అని అందరికీ తెలిసిందే.