నల్లగొండ : బీజేపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యకు కుట్రలు పన్నడాన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోతే అనేక అనుమానాలు, అపోహలకు కలుగుతున్నాయన్నారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ చేసే కామెంట్లను చూస్తుంటే దొంగనే దొంగ అంటూ భుజాలు తడుముకుంటున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజమైన దోషులను పట్టుకుంటారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో ఎవరిపైనా అన్యాయంగా అక్రమంగా కేసులు ఎప్పుడూ పెట్టలేదన్నారు.
టీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేసి ఓట్లడుగుతుందని, దౌర్జన్యాలు చేసి ఎన్నడూ ఓట్లు అడగదని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.