Congress | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నదా? ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ, మరో పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా.? తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనిపిస్తున్నది. హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎంను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకోసం ఎంఐఎంకు పోటీగా భావిస్తున్న మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఎంబీటీకి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు చోట్ల బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. ఎంఐఎం తమతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ మంత్రులు పలుమార్లు ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని చెప్పారు. అయితే, స్నేహపూర్వక పోటీ కాకుండా ఎంఐఎంను ఓడించేందుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది.
ఇందులో భాగంగానే ఎంబీటీతో మొదటి దఫా చర్చలు పూర్తయ్యాయని, ఎంబీటీ మద్దతుతో మైనార్టీ ఓటుబ్యాంకును చీల్చవచ్చని, తద్వారా ఎంఐఎంను ఇరుకున పెట్టొచ్చని, అవసరమైతే ఓడించొచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని, ఎంఐఎంను సొంత గడ్డమీద ఓడిస్తే ఓటుబ్యాంకు మరింత బలపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అంతేకాకుండా.. ఎంఐఎంను నమ్మలేమని, ఎప్పుడూ తన స్వార్థం కోసం అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం నటిస్తుందే తప్ప ఎవరితోనూ నిజమైన భాగస్వామిగా ఉండదని కాంగ్రెస్ పెద్దలు విశ్వసిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో ఓ సందర్భంలో ‘మీరు ముస్లింలందరికీ ప్రతినిధి కాదు’ అని అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగానే ఎంబీటీతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంబీటీని 1993లో మహ్మద్ అమానుల్లాఖాన్ స్థాపించారు. ఎంఐఎం అధ్యక్షుడు సలావుద్దీన్ ఓవైసీతో విభేదించి సొంతంగా పార్టీ నెలకొల్పారు. అప్పటి నుంచి పాతబస్తీలో ఎంఐఎంకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఎదుగుతున్నది. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మంచి ఓటు బ్యాంకు ఉండగా, ముఖ్యంగా యాకత్పురాలో బలంగా ఉన్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 878 ఓట్ల తేడాతో అక్కడ సీటును కోల్పోయింది. దీంతోపాటు చాంద్రాయణగుట్ట, మలక్పేటలోనూ పార్టీకి మంచి పట్టున్నది.