హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాఘవ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ టెండర్ జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాఘవ సంస్థకు దక్కేలా చర్యలు తీసుకొంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థ ప్రభుత్వంలో నంబర్ 2గా వెలుగొందుతున్న మంత్రికి చెందినది కావడంతో రాఘవకు కాంట్రాక్ట్లు వర్తించేలా జీవోలు జారీ అవుతున్నాయనే విమర్శలున్నాయి. తాజాగా అమృ త్ 2.0 కింద ఎస్టీపీ (సీవేజీ ట్రీట్మెంట్ప్లాంట్- మురుగునీటి శుద్ధి కర్మాగారం)లు నిర్మించేందుకు జలమండలి పిలిచిన టెండర్లలో ఏకంగా 51% షేర్ లభించేలా జీవో విడుదల చేసి రాఘవకు లబ్ధి చేకూర్చినట్టు సమాచారం.
హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి, మూసీలో కాలుష్య నియంత్రణకు అమృత్ 2.0లో భాగంగా సుమారు రూ.4 వేల కోట్లతో 39 ఎస్టీపీలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా 22 ఎస్టీపీల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. దీని అంచనా వ్యయం రూ.1,906.44 కోట్లుగా నిర్ణయించారు. టెండర్లో నేరుగా పాల్గొనేందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్కు సాంకేతిక అర్హతలు లేవు. దీంతో బీవీఎస్ఆర్, ఎస్ఎస్జీ కంపెనీలతో కలిసి రాఘవ సీవరేజీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టెండర్ దక్కించుకున్నారు. ఇందులో రాఘవ కన్స్ట్రక్షన్స్కు 26%, ఎస్ఎస్జీ ఇన్ఫ్రాటెక్కు 23%, బీవీఎస్ఆర్కు 51% వాటా ఉండేది.
తాజా గా రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మిగిలిన 2 సంస్థలతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తన వాటాను 51 శాతానికి పెంచుకొనేందుకు అనుమతులిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్టీపీల నిర్మాణంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ లీడ్ పార్ట్నర్గా అవతరించింది. ఎస్టీపీల నిర్మాణంలో అనుభవం లేని రాఘవ కన్స్ట్రక్షన్స్ను జాయింట్ వెంచర్ ద్వారా 51% వాటాను పెంచుకొనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.