మణుగూరు టౌన్, జూన్ 15 : శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. ప్రజలను అన్ని రంగాల్లో నట్టేట ముంచిందని ఎమ్మెల్సీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని గుట్టమల్లారంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమగ్ర ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు జరుగనున్నదని, ఇందుకోసం బీఆర్ఎస్ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లను నియమించి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి కూడా అవగాహన కల్పించామని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ రెండున్నరేండ్లలో అభివృద్ధిని విస్మరించి, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గ అభివృద్ధిలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర పెద్దదని గుర్తుచేశారు. నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘతన బీఆర్ఎస్దేనని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అమలుచేస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొంటానని చెప్పారు. సింగిల్ ఎజెండాతో ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ గెలువాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పార్టీ ఆదేశాలమేరకు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
రఘునాథపాలెం, జూన్ 15 : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు పర్యటనకు వస్తున్నట్టు బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద ఉదయం 11 గంటలకు జరిగే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఎస్ఐఆర్లో భాగంగా అర్హులైనవారు తమ ఓటు హక్కును కోల్పోకూడదనేది పార్టీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పాలేరు నియోజకవర్గం కోసం నియమించిన 291 మంది బూత్ లెవల్ అసిస్టెంట్లతోపాటు ఈ-డిజిటల్ సభ్యులు, నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు పాల్గొన్నారు.