హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి, అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే మహిళల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి గడిచిన 20 మంగళవారాల్లో మొత్తం 1,85,492 మంది మహిళలు స్రీనింగ్ పూర్తి చేసుకొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 272 ఆరోగ్య మహిళ క్లినిక్స్ ద్వారా మహిళలకు సేవలందుతున్నాయి. ఈ క్లినిక్స్లో ప్రధానంగా 8 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. మధుమేహం, బీపీ, రక్తహీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ముక్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్, సూక్ష్మపోషకాహార లోపాలు, అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్లమేటరీ, మెనోపాజ్ దశ, నెలసరి, సంతాన సంబంధిత పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేస్తారు. సమస్యలు ఉంటే వైద్యం అందించడంతో పాటు ఉన్నత స్థాయి వైద్యం అవసరమున్నవారిని, సమీపంలోని రిఫరల్ సెంటర్ వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యం సేవలు అందేలా చూస్తున్నారు. మమ్మోగ్రాం, అల్ట్రాసౌండ్, కొలనోసోపీ, క్రియోథెరపీ, పాప్స్మియర్, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమైన వారికి చేస్తున్నారు.
ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలామంది మహిళలు దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నాం. సమస్య ఉన్నప్పటికీ కుటుంబీలకు చెప్పుకోవడం ఇష్టంలేక కొందరు, వ్యాధి లక్షణాలపై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్యం, పరీక్షలు, మందులు పొందుతున్నారు. మహిళలందరూ ఆరోగ్య మహిళ క్లినిక్స్ను సద్వినియోగం చేసుకోవాలి.
-హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి