హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలో కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది. సర్వే నంబర్ 307లోని ఆ భూములపై హక్కులు ప్రైవేట్ వ్యక్తులవేనని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆ భూములపై హకులు ఎవరివో తేల్చాల్సింది హైకోర్టు కాదని, సివిల్ కోర్టని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి భూమికి హకుదారులు ఎవరో తేల్చడం సివిల్ కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొన్నది.
విచక్షణాధికారాలతో హకులను పరిరక్షించాలే తప్ప లేని హకులను సృష్టించకూడదని, ఇప్పుడున్న హకులు చట్టబద్ధమో కాదో తేల్చాలని స్పష్టం చేసింది. సదరు 18 ఎకరాల భూములకు హక్కుదారులెవరో సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది. గాజులరామారం వాసులు నర్సింహారెడ్డి, పీ సీతారాంరెడ్డి తదితరులకు చెందిన ఈ భూములను గతంలో ప్రభుత్వం గరిష్ఠ భూపరిమితి చట్టం కింద స్వాధీనం చేసుకున్నది. ఆ తర్వాత ఆ భూములను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు లీజుకు ఇచ్చింది. కానీ, ఆ భూములను తాము కొన్నామంటూ 2011లో పద్మనాభరావు, ఆర్ భాసరరాజు వారసులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీంతో ఆ 18 ఎకరాలు పిటిషనర్లవేనని, ఆ భూముల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని 2013లో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రద్దు చేయడంతో ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.