హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి నిమజ్జన శోభ సంతరించుకున్నది. బొజ్జ గణపయ్య నిమజ్జన మహోత్సవానికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తి చేసేలా, బాలాపూర్ గణేశుడి లడ్డువేలం పూర్తిచేసి మధ్యాహ్నం 12కు శోభాయాత్ర ముందుకు సాగేలా ట్రై పోలీస్ కమిషన్ పోలీసులు ప్రణాళికలు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర సమన్వయ సమావేశాలు నిర్వహించారు. రూ.30 కోట్లు వెచ్చించి శోభాఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
నగరవ్యాప్తంగా సాగే 303.3 కిలోమీటర్ల శోభాయాత్రను వీక్షించేందుకు భక్తులు రానున్న నేపథ్యంలో శోభాయాత్ర రూట్కు మరమ్మతులు చేసి, 48,179 వీధిదీపాలు ఏర్పాటుచేశారు. హుస్సేన్సాగర్, సరూర్నగర్తోపాటు 33 చెరువుల వద్ద 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్ఎఫ్ బృందాలు, పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 74 బేబీ పాండ్స్ను ఏర్పాటుచేశారు. కొలనుల వద్ద 27 బోట్స్ ఉంచారు. 256 క్రేన్లు ఉపయోగిస్తారు. ఆర్అండ్బీ స్వాగత వేదికలను ఏర్పాటుచేసింది. భక్తులకు మొబైల్ టాయిలెట్లు, స్టాటిక్ టాయిలెట్లు ఏర్పాటుచేశారు. 3 వేల మంది శానిటేషన్ సిబ్బంది సేవలందించనున్నారు. లక్షల్లో సీసీ, మౌంటెడ్, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్లోని ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా సాంకేతిక నిఘాను ట్రై పోలీస్ కమిషనరేట్లలో ఏర్పాటుచేశారు.
రాత్రి ఒంటిగంట వరకూ మెట్రో సేవలు
నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు అనువుగా ఉండేలా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు కొనసాగుతాయి. గణేశ్ నవరాత్రి వేడుకల సందర్భంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ప్రతిరోజు 60 వేల మంది రాకపోకలు సాగించారని, ఇందులో బడా గణేశ్ను దర్శించుకోవడానికి వచ్చిపోయినవారే ఎక్కువగా ఉన్నారని మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నిమజ్జనం సందర్భంగా రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్లను నడుపుతున్నట్టు తెలిపారు.
నల్లగొండలో 36 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
రామగిరి/కొండాపూర్, సెప్టెంబర్ 27: నల్లగొండ జిల్లాకేంద్రంలోని పాతబస్తీ హనుమాన్నగర్ ఒకటో నంబర్ విగ్రహం వద్ద లడ్డూను పెరిక కరణ్జయరాజు రూ.36 లక్షలకు దక్కించుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని నాలెడ్జ్ సిటీ మైహోం భూజలో వినాయకుడి లడ్డూను ఉన్నతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ ఈదులకంటి చిరంజీవిగౌడ్, సునీత రూ.25.50 లక్షలకు దక్కించుకున్నారు.