హైదరాబాద్ : స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister koppula eshwar) అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విద్యారంగం బలోపేతం అయిందని చెప్పారు. TSWRDCW కరీంనగర్ సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి లక్షా 20 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.
నాటి పాలకల నిర్లక్ష్యం, వసతుల లేమితో కుదేలైన విద్యారంగం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో బలోపేతమై విద్యారంగంలో అద్భుత ఫలితాలు సాధిస్తుందన్నారు. తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకు వచ్చారని చెప్పారు.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గురుకులాలు పేరుకు మాత్రమే ఉండేవి, అప్పుడు పిల్లలను చేర్పించడానికి తల్లి తండ్రులు ముందుకు వచ్చే వారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో గురుకులాలకు మహర్దశ పట్టింది. నేడు గురుకులాల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.
రాష్ట్ర ఆవిర్భావినికి ముందు 298 గురుకుల విద్యాసంస్థలు ఉండగా వాటిని 1030కి పెంచామన్నారు. కోట్లాది రూపాయల నిధులతో సకలవసతులు కల్పించి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యా బోధన అందిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో ఎంతో మంది గ్రామీణ పేద విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
పోటీ పరీక్షల్లో గురుకుల విద్యార్ధులు ప్రతిభచాటుతూ తెలంగాణ ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటుతున్నారని ప్రశంసించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి గైడ్ లైన్స్ పాటించడంతో 95 శాతం ఉత్తీర్ణత సాధించారని.. ఇది తెలంగాణ ప్రభుత్వం గొప్పతనం అన్నారు. అంతకు ముందు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నగునూర్ ఆవరణలో మొక్కను నాటారు.