హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పటికే కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు, కల్యాణలక్ష్మీ తదితర ఎన్నో పథకాలను కేంద్రం సహా పలు రాష్ర్టాలు ఇప్పటికే వివిధ పేర్లతో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం మరో పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను సమగ్రాభివృద్ధి చేసి చేపల పెంపకాన్ని బలోపేతం చేస్తామని బడ్జెట్లో ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. ఇప్పటికే సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులోనే కేంద్రం కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలను శ్లాఘించింది. తెలంగాణలో ఆయకట్టు విస్తీర్ణం అత్యల్ప కాలంలోనే అసాధారణ స్థాయిలో విస్తరించిందని వెల్లడించింది. 1.30కోట్ల ఎకరాల నుంచి 2.20కోట్ల ఎకరాలకు ఆయకట్టు పెరిగిందని తెలిపింది. తదనుగుణంగా కేంద్రం సైతం రిజర్వాయర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టింది.