హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. అదానీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చింది. అయితే లోక్సభ, రాజ్యసభ సభాపతులు నోటీసుపై చర్చను అనుమతించకపోవడంతో నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ఆమ్ఆద్మీ, శివసేన ఎంపీలు కూడా బీఆర్ఎస్తో కలిసివచ్చారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, డిమాండ్ను అంగీకరించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని, అదానీ వ్యవహారం అంతా బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం సరికాదన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యవహరించాలని హితవు పలికారు. నిరసనల్లో బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.
మోదీ హయాంలో అమాంతం పెరిగిన అదానీ సంపద: రాహుల్
మోదీ-అదానీ ‘బంధం’ ఎన్నో ఏండ్లది అని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సంపద అమాంతంగా అనేక రెట్లు పెరిగిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. 2014 తర్వాత ప్రధాని మోదీ హయాంలో మ్యాజిక్ జరిగిపోయిందని, ప్రపంచం కుబేరుల్లో 609వ స్థానంలో ఉన్న అదానీ.. రెండో స్థానానికి ఎగబాకారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘మీరు ఒక దేశానికి వెళ్లివచ్చిన వెంటనే ఆ దేశానికి అదానీ ఎన్నిసార్లు వెళ్లారు? మీ విదేశీ పర్యటన తర్వాత ఆ దేశాల్లో అదానీ ఎన్ని కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు? వీటికి సమాధానం చెప్పండి?’ అని డిమాండ్ చేశారు.
పీఎం కిసాన్ సాయాన్ని పెంచం: కేంద్రం
పీఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ‘ప్రస్తుతం ఏడాదికి రూ.6,000 సాయంగా అందజేస్తున్నాం. దీన్ని పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదు’ అని పేర్కొన్నారు.
సాయుధ బలగాల్లో 83,000 పోస్టులు ఖాళీ కేంద్ర సాయుధ బలగాల్లో 83,000కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. వీటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సతీసహగమనాన్ని కీర్తించిన బీజేపీ ఎంపీ
సతీసహగమనాన్ని కీర్తించేలా బీజేపీ ఎంపీ సీపీ జోషీ చేసిన వ్యాఖ్యలు మంగళవారం లోక్సభలో గందరగోళానికి దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ ఎంపీ జోషి మాట్లాడుతూ… చిత్తోర్ కోటను అల్లావుద్దిన్ ఖిల్జీ ముట్టడించినప్పుడు మేవార్ రాణి పద్మావతి ఆమె గౌరవాన్ని కాపాడుకునేందుకు స్వీయ దహనం చేసుకొని మరణించిందని పేర్కొన్నారు. సతీసహగమనాన్ని కీర్తించేలా ఎంపీ మాట్లాడారని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు సుప్రియా సూలే, కనిమొళి, దయానిధి మారన్, ఏ రాజా, కే మురళీధరన్, ఇంతియాజ్ జలీల్ తదితరులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా 20 నిమిషాలు వాయిదా వేశారు. అయితే, తాను ‘సతీ’ని సమర్థించలేదని, ట్రాన్స్లేషన్లో జరిగిన పొరపాటు వల్లే సభ్యులు తప్పుగా అర్థం చేసుకున్నారని ఎంపీ జోషీ వివరణ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి అభ్యంతరకరమైన అంశాలను తొలగిస్తామని స్పీకర్ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.