Vijayawada | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష రోజురోజుకూ శృతిమించుతున్నది. తెలంగాణకు, ఏపీకి మధ్య ఎన్హెచ్-765, ఎన్హెచ్-65 రహదారులను విస్తరించాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు కోరినా నరేంద్రమోదీ సర్కారు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలకు నిత్యం ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వరకు 2 లేన్లతో ఉన్న ఎన్హెచ్-765ను నాలుగు లేన్లకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతున్నది. దీనిపై ఇప్పటికే 15,000 పీసీయూ (ప్యాసింజర్ కార్ యూనిట్) ట్రాఫిక్ ఉన్నది. ఈ రహదారికి అనుబంధంగా ప్రస్తుతం కరివెన సెక్షన్లో కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు కేంద్ర జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టిన ఎన్హెచ్-167కే నిర్మాణం పూర్తైతే ఎన్హెచ్ 765పై ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. ఎన్హెచ్-167కే అందుబాటులోకి వస్తే తెలంగాణలోని కల్వకుర్తి, కొల్లాపూర్, సోమశిలతోపాటు ఏపీలోని ఆత్మకూరులోగల వెనుకబడ్డ ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఎన్హెచ్-167కే రహదారి నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై సోమశిల వద్ద వంతెన నిర్మాణాన్ని కూడా చేపడుతుండటంతో హైదరాబాద్, తిరుపతి, చెన్నై మధ్య ప్రయాణ దూరం దాదాపు 80 కి.మీ. తగ్గుతుంది.
అటకెక్కిన ఎన్హెచ్-65 విస్తరణ
హైదరాబాద్-విజయవాడ మధ్య ఉన్న ఎన్హెచ్-65 విస్తరణ కూడా దీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్నది. 2012లో నాలుగు లేన్లకు విస్తరించిన ఈ రహదారిని 2024 నాటికి ఆరు లేన్లకు విస్తరించేందుకు జీఎమ్మార్ హైదరాబాద్-విజయవాడ ఎక్స్ప్రెస్వేస్ లిమిటెడ్తో ఒప్పందం జరిగింది. ప్రస్తుతం ఈ రహదారిపై రోజూ 50 వేలకుపైగా వాహనాలు తిరుగుతున్నట్టు టోల్ ప్లాజా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కానీ, రాష్ట్ర విభజన వల్ల ఈ రహదారిపై ట్రాఫిక్ తగ్గిందని, ఫలితంగా 6 లేన్లకు విస్తరించడం సాధ్యంకాదని కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసింది. ఈ మేరకు ఆ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి పండుగల సమయంలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్లు ఏర్పడి కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోతున్నాయి.