హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణినిఅవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25, 28 తేదీల్లో పార్లమెంట్కు సమాధానాలు స్పష్టం చేస్తున్నాయి. ఎయిమ్స్ నిర్మాణాలపై బీఆర్ఎస్ ఎంబీ బడుగుల లింగయ్య యాదవ్తోపాటు ఎంపీలు ఎన్ రెడ్డప్ప, డాక్టర్ కళానిధి వీరాస్వామి అడిగిన ప్రశ్నలకు కేంద్రం పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇచ్చింది. వీటిని విశ్లేషిస్తే తెలంగాణ ఎయిమ్స్పై మోదీ సర్కారు ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నదో కూడా అర్థమవుతుంది.
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1,365.95 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఈ నెల 25న తెలిపిన కేంద్రం.. అదే నోటితో ఈ పనులను రూ.1,028 కోట్లతో చేపట్టినట్టు శుక్రవారం చెప్పింది. అంటే కేవలం మూడు రోజుల్లోనే బడ్జెట్ సుమారు రూ.338 కోట్లు తగ్గిపోయింది.
బీబీనగర్ ఎయిమ్స్ కోసం ఇప్పటివరకు రూ.379.90 కోట్లు ఖర్చు చేశామని, పనులు 21 శాతం పూర్తయ్యాయని ఈ నెల 25న చెప్పిన కేంద్రం.. మూడు రోజుల తర్వాత బీబీనగర్ ఎయిమ్స్ పనులు 24% పూర్తయ్యాయని పేర్కొన్నది. అంటే.. మూడు రోజుల్లోనే పూర్తయిన పనులు 3% పెరిగాయన్నమాట.
బీబీనగర్ ఎయిమ్స్ను 2018 డిసెంబర్ 17న మంజూరు చేసినట్టు తెలిపిన కేంద్రం.. ఈ నిర్మాణాలకు 2023 ఏప్రిల్ 8న శంకుస్థాపన చేసినట్టు చెప్పింది. అంటే.. ప్రాజెక్టు మంజూరైన నాలుగున్నరేండ్ల తర్వాత శంకుస్థాపన చేశారన్నమాట. ఈ పనులు మొదలై 20% పూర్తయ్యాక మళ్లీ శంకుస్థాపన చేయడం కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది. పోనీ కేంద్రం చెప్పినట్టు చూసినా.. పునాదిరాయి వేసిన మూడు నెలల్లోనే 21% పనులు పూర్తిచేసినట్టు లెక్క. ఇదీ హాస్యాస్పదమే.
తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష చూపుతున్నట్టు కేంద్రం ఇచ్చిన సమాధానాలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో తెలంగాణకు ఎయిమ్స్ను మంజూరు చేసిన కేంద్రం.. అదే ఏడాది హిమాచల్ప్రదేశ్కు కూడా ఓ ఇన్స్టిట్యూట్ను కేటాయించింది. దాని పనులు ఎప్పుడో పూర్తవడంతో నిరుడు అక్టోబర్లో జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత మంజూరైన ఎయిమ్స్ల నిర్మాణ పనులు సైతం బీబీనగర్ ఎయిమ్స్ కంటే వేగంగా జరుగుతున్నాయి. దీనిని బట్టి బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తున్నట్టు రుజువవుతున్నది.