నిర్మల్ : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ బీమారంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం దిలావర్ పూర్లో ఎల్ఐసీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మంత్రి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కోసం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ప్రజలపై పన్నులభారం మోపుతున్నదని విమర్శించారు.
రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్, విమానయానం, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి అనేక ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.
కార్మికులందరూ ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలన్నారు. కేంద్ర మంత్రులు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలి తెలంగాణ గల్లీల్లో తిరుగుతూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.