హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరించేలా విద్యుత్తు (సవరణ) నిబంధనలు -2023 పేరిట ఓ ముసాయిదాను రూపొందించింది. దీనిపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా.. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. దీనిపై 21 రోజుల్లో అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ సూచించింది. కేంద్రం తాజాగా రూపొందించిన ఈ ముసాయిదా ప్రకారం.. డిస్కం (డిస్ట్రిబ్యూటరీ లైసెన్సీ)లకు వచ్చే లాభనష్టాల్లో వినియోగదారులను భాగస్వామ్యం కల్పించారు. లాభం వస్తే.. అందులో మూడింట రెండు వంతులు (66.66 శాతం) విద్యుత్తు వినియోగదారుడికి ఇవ్వాలని, మిగిలిన ఒక భాగం డిస్కంకు చెందుతుందని స్పష్టం చేశారు. నష్టం వస్తే.. 50 శాతం (సగం) వినియోగదారుడి నుంచి (చార్జీల రూపంలో) వసూలు చేయాలని కూడా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని డిస్కంలు నష్టాల్లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్తున్నది.
నష్టాల నుంచి డిస్కంలను బయటపడేసేందుకు ఉదయ్ లాంటి స్కీములను కేంద్రం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో డిస్కంలు ఎదుర్కొంటున్న నష్టాలను దొడ్డిదారిన వినియోగదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసేందుకే ఈ ముసాయిదాను రూపొందించారని విద్యుత్తురంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్తు పంపిణీలో అనుమతించిన ఏటీ అండ్ సీ నష్టాలకు.. సగటు కొనుగోలు ధరకు మధ్య తేడా భారీగానే ఉంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో డిస్కంలకు నష్టాలే వస్తాయి. దీనిని సరిదిద్దకుండా.. కేంద్రం రూపొందించిన ముసాయిదా.. అంతిమంగా వినియోగదారుడిపైనే భారం మోపేదిగా ఉన్నదని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిస్కంలను ప్రైవేటీకరిస్తామని చెప్తున్న కేంద్రం.. ఈ ముసాయిదాతో ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసినట్టుగా నిపుణులు అనుమానిస్తున్నారు. డిస్కంలకు కలిగే నష్టాల్లో వినియోగదారుల నుంచి 50 శాతం మేర చార్జీల రూపంలో వసూలు చేస్తే.. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డిస్కంలను ప్రైవేటీకరించడం సులభతరం కాగలదని అంటున్నారు. లాభాలు వస్తే వినియోగదారులకు మూడింట రెండు వంతులు చెల్లిస్తామని చెప్తున్న కేంద్రం.. డిస్కంల నష్టాల నివారణకు మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదు. వాస్తవానికి డిస్కంలకు వస్తున్న నష్టాలలో సగం మొత్తాన్ని వినియోగదారుడిపై మోపేందుకే కుట్రపూరితంగా ఈ ముసాయిదాను రూపొందించారని నిపుణులు పేర్కొంటున్నారు.