హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ను నిర్మిస్తున్నామని హైదరాబాద్ సభలో ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. వాస్తవానికి ఆ ప్రాజెక్టును అటకెక్కించాలని చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్లో కేవలం ఉత్తర భాగం నిర్మాణానికి మాత్రమే ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన భూసేకరణకు గెజిట్లు విడుదలలో ఎడతెగని జాప్యం చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. ఈ భూసేకరణ ఖర్చులో 50% మొత్తాన్ని ముందే తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో దీనికి నిధులు కూడా కేటాయించింది. పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు 8 భూసేకరణ యూనిట్లను ఏర్పాటుచేస్తూ మార్చి 16న జీవో విడుదల చేయడంతోపాటు దానిని కేంద్రానికి పంపింది.
దీంతో 19 మండలాలు, 113 గ్రామాల మీదుగా రోడ్డును నిర్మించేందుకు మార్చి చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక గెజిట్ను విడుదల చేసింది. ఆ తర్వాత 10 రోజుల్లోనే భూసేకరణ గెజిట్లను విడుదల చేయాలిన మోదీ సర్కారు ఏమీ పట్టనట్టు కాలయాపన చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేసిన నెల రోజుల తర్వాత యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్, జోగిపేట, ఆందోల్ ఆర్డీవోల నేతృత్వంలోని యూనిట్ల పరిధిలోని గ్రామాల్లో భూసేకరణకు అభ్యంతరాలు స్వీకరిస్తూ కేంద్రం ఏప్రిల్ 19న గెజిట్ విడుదల చేసింది.
కానీ మిగిలిన ఆరు యూనిట్లలో భూసేకరణకు గెజిట్ విడదల చేయలేదు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ట్రిపుల్ ఆర్ను నిర్మించాలని సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన వెంటనే నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా అధ్యయనం చేయించి, అన్ని అనుకూలతలు ఉన్నాయని ధ్రువీకరించుకొన్నారు. ఆ తర్వాతే జాతీయ రహదారుల కింద ట్రిపుల్ ఆర్ను నిర్మించాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై పదేపదే ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం భూసేకరణ దశలోనే అడ్డంకులు సృష్టిస్తుండటంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.