హైదరాబాద్, సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భార్ (భారత్) ఓఎస్ పేరుతో ఐఐటీ మద్రాస్లో దీనికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘భార్ ఓఎస్’ (బీహెచ్ఎఆర్ ఓఎస్) పేరుతో రూపొందించిన ఆపరేటింగ్ సిస్టంను వీడియో కాల్ ద్వారా ప్రత్యేకంగా పరీక్షించారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలే ఉన్నాయి. ఈ రెండూ అమెరికాకు చెందిన కంపెనీలవే. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచే ఒక స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా వందకోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఉంచేలా, సౌకర్యంగా వినియోగించుకునేలా ఈ ఓఎస్ ఉండబోతుందని ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు వెల్లడించారు. ఐఐటీ మద్రాస్లో ఇంక్యుబేటర్ అయిన జండ్-కే ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జండ్ కాప్స్) సంస్థ దీన్ని రూపొందించింది. ఈ ఓఎస్ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన కంపెనీలకే ఇచ్చామని, త్వరలో ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి తెలిపారు. ఈ ఓఎస్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచుతుందని జండ్ కాప్స్ సంస్థ డైరెక్టర్ కార్తీక్ అయ్యర్ వివరించారు.
ఇవీ భార్ ఓఎస్ ఫీచర్స్
ఈ ఓఎస్ లో ఎలాంటి డీఫాల్ట్ యాప్స్ ఉండవు. వినియోగదారుడు తనకు నచ్చిన విధంగా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే యాప్లను ఎంపిక చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్, లేదా ఐఓఎస్లో కొన్ని యాప్లు డీఫాల్ట్గా వస్తుంటాయి. మొబైల్ వాడేవారికి వాటి అవసరం లేకున్నా ఫోన్లో ఉండిపోతుంటాయి. దీని వల్ల ఫోన్ మెమొరీపై భారం పడుతుంది. కానీ ఈ కొత్త ఓఎస్లో అలాంటి ఇబ్బంది ఉండదు. సురక్షితమైన, గోప్యతకు భంగం కలిగించని యాప్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. ఈ ఓఎస్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ నేటివ్ ఓవర్ ది ఎయిర్ (ఎన్ఓటీఏ) ద్వారానే వస్తాయని డెవలపర్స్ చెప్తున్నారు. అయితే దీనివల్ల యూజర్ ప్రమేయం లేకుండా ఓఎస్ అప్డేట్లన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి. మొబైల్ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండడం వల్ల ఫోన్ లోని డాటా సురక్షితంగా ఉంటుందని వివరిస్తున్నారు. పైగా బ్యాటరీ పనితీరు కూడా రెండు మూడు రెట్లు మెరుగవుతుందని చెప్పారు.