హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణను హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. ప్రత్యూష్సిన్హా కమిటీ సిఫార్సులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు క్యాట్ నుంచి ఉత్తర్వులు పొంది తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది.
సీఎస్గా చేసిన సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయించడాన్ని సమర్థిస్తూ గతంలో వెలురించిన తీర్పును డీజీపీ అంజనీకుమార్ సహా ఐదుగురు అధికారులకు వర్తింపజేయాలని కేంద్రం కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ తాము చేసిన అప్పీల్పై తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఇతర అధికారుల కేసుల విచారణను వాయిదా వేయాలని కోరింది. రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీకతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది.