హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం తక్షణమే జాతీయ హోదా ప్రకటించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని, ఆ తరువాతనే పాలమూరు గడ్డపై అడుగుపెట్టాలని అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ ఒకటిన ప్రధాని పాలమూరు జిల్లాకు రానున్న నేపథ్యంలో.. బీజేపీ ఆ జిల్లా ప్రజానీకానికి సమాధానం చెప్పాలని కోరారు.
పాలమూరు గడ్డకు బీజేపీ ఏం చేసిందని ప్రధాని ఇకడికి వచ్చి ఏం చెప్తారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి అడుగడుగునా అనుమతుల పేరుతో కేంద్రం అడ్డంకులు సృష్టించిందని, సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, శ్రమతో ఇప్పుడు అంతా సిద్ధమయ్యాక.. చుట్టపు చూపుగా వచ్చి ఫొటోలకు ఫోజులు కొట్టడానికి మోదీ వస్తున్నారా? అని నిలదీశారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, నిర్మాణం కోసం కేంద్రం విధులు కేటాయించాలని పార్లమెంట్ వేదికగా ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదని అన్నారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో అకడి అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని ధ్వజమెత్తారు. వారికివ్వడంలో అభ్యంతరమేమీ లేదని, పాలమూరుకు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన తర్వాతనే ప్రధాని పాలమూరుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు మోదీపై ఒత్తిడి తేవాలని, లేకుంటే పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలు ఆ పార్టీని ఎన్నటికీ క్షమించరని స్పష్టం చేశారు.