కరీంనగర్ ముకరంపుర, ఆగస్టు 5: తెలంగాణలో భూమికి బరువయ్యేంత పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పంటను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని చెప్పారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శుక్రవారం నిర్వహించిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు. తెలంగాణలో సుస్థిర పాలన, శాంతిభద్రతల పరిరక్షణలో శభాష్ అనేలా పాలన అందించే కేసీఆర్ ప్రభుత్వాన్ని 60 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సోనియా ఢిల్లీలో మీట నొక్కితే ఇక్కడ ఆ పార్టీ నాయకులు అదేవిధంగా అనుసరిస్తారని, బీజేపీలో అమిత్షా ఏం చేబితే అదే ఇక్కడ చేస్తారని ఎద్దేవా చేశారు. అదే తెలంగాణాలో ప్రజలు ఏం చెబితే కేసీఆర్ అదే చేస్తారన్నారు. ఎనిమిదేళ్లుగా మనల్ని మనం పాలించుకొంటే వారికి ఎందుకంత కళ్ల మంట? అని ప్రశ్నించారు.