హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నదని, అందుకే ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ సర్కార్ నిర్ణయంతో రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనలతో ఉపసంహరించుకున్న నల్ల వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, అందుకే ధాన్యం సేకరణలో ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించిందని ధ్వజమెత్తారు. రైతులతోపాటు పేదల కడుపుకొట్టే ఈ దుర్మార్గ చర్యలను వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గత వానకాలం, యాసంగి సీజన్లలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సేకరించకపోవడంతోపాటు రాష్ర్టాలపై ఆంక్షలు విధించిందని, ఫలితంగా బియ్యం, గోధుమల ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. నూకల ఎగుమతిని నిలిపివేసి, బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడంతో మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.