సూర్యాపేట, డిసెంబర్ 2: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేటలోని రాయిన్గూడెంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు పరాకాష్టకు చేరాయన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలను టోకుగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నదని, ఫలితంగా ప్రజలు ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.