హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం గెజిట్ విడుదల చేయలేదు. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి నర్సాపూర్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించే రోడ్డు కోసం 151.524 కిలోమీటర్లకే భూసేకరణ గెజిట్లు విడుదలయ్యాయి.
జోగిపేట-అందోల్-నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల మధ్య 7.121 కిలోమీటర్ల మేర భూసేకరణకు గెజిట్ విడుదల కావాల్సి ఉన్నది. అలైన్మెంట్ ఖరారు కాకపోవడంతోనే దీని గెజిట్ విడుదల చేయనట్టు తెలిసింది. అయితే, అలైన్మెంట్ ఖరారైంది కానీ భూసేకరణకు సంబంధించిన ఇతర అంశాల వల్ల ఈ 7 కిలోమీటర్లకు గెజిట్ విడుదల కాలేదని అధికారులు చెప్తున్నారు. జంక్షన్ల కోసం అదనంగా భూమిని సేకరిస్తున్నందున, వాటితో కలిపి అడిషనల్ గెజిట్ విడుదల అవుతుందని తెలిపారు.
ట్రిపుల్ ఆర్ కోసం కేంద్రం ఇప్పటి వరకు 8 గెజిట్లు విడుదల చేసింది. ఈ గెజిట్ల ప్రకారం.. అత్యధికంగా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 389 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఈ డివిజన్లోనే ట్రిపుల్ ఆర్ 31 కిలోమీటర్లు ఉంటుంది. అతి తక్కువగా జోగిపేట రెవెన్యూ డివిజన్లో 108 హైక్టార్ల భూమిని సేకరిస్తున్నారు.