హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో గుణాత్మక మార్పులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులను నాలుగేండ్ల కాలపరిమితితో నిర్వహించాలని భావిస్తున్నది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని 2022లోనే రూపొందించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ).. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
అంతేగాక, మార్పులు చేర్పులతో తుది ప్రతిని రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇందులోభాగంగా 27న ఢిల్లీలో కీలక సమావేశం కానున్నది. ఈ భేటీలో నాలుగేండ్ల సమీకృత బీఈడీ కోర్సులపై ప్రధానంగా చర్చించనున్నారు. నాలుగేండ్ల కాలపరిమితిలో ఏయే బోధన విధానం ఉండాలి? పాఠ్యాంశాల రూపకల్పన ఏ స్థాయిలో ఉండాలనే అంశాలపై ఎన్సీటీఈ దృష్టిసారించింది.