హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) పేరుతో దేశవ్యాప్తంగా రూ. 200 కోట్ల మోసానికి పాల్పడిందో ముఠా. ఢిల్లీకి చెందిన పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.9,999 పెట్టుబడి పెడితే 36 నెలల పాటు రూ.880 తిరిగి చెల్లిస్తామని, హెర్బల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇస్తామని వసూలు చేసింది. స్టోర్ల కోసం రూ.6 లక్షల పెట్టుబడి పెడితే, 30 నెలల పాటు రూ.30 వేల చొప్పున ఇస్తామని, అమ్మే వస్తువులపై 5 శాతం కమీషన్ ఇస్తామని నమ్మబలికారు. ఇలా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో కార్యాలయాలు తెరిచి 6-7 వేల మందిని సభ్యులుగా చేర్చుకొని, వాళ్ల వద్ద రూ.200 కోట్లు వసూలు చేశారు.
హైదరాబాద్లో ఈ ముఠా కాటేదాన్, శాలిబండ, దారుసలాం, మల్కాజిగిరి, సీతాఫల్మండి ప్రాంతాలల్లో దం దాకు పాల్పడింది. దీనిపై ఫిర్యాదు అందటంతో అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ సారథ్యంలో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీకి ప్రత్యేక బృందా న్ని పంపి నిందితులు రిజాయుద్దీన్, పూజకుమారిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. వారితోపాటు బోర్డు లగావో-పైసా కమావో అంటూ మల్టీ లెవల్ మార్కెటింగ్ చేసి రూ.12 కోట్ల మోసానికి పాల్పడ్డ యూపీలోని ఘజియాబాద్కు చెందిన బాబీ చౌదరి అలియాస్ ఇజాజ్ అహ్మద్ను కూడా అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ అనేది అక్రమమని, ఇలాంటి స్కీమ్లలోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు.