హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలోని బొగ్గు ప్రాజెక్టులు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేసి, ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయడమే లక్ష్యంగా విదేశీశక్తులు పన్నిన కుట్రలపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ పర్యావరణ న్యాయవాది రిత్విక్దత్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రిత్విక్దత్తా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)ను ఉల్లంఘించినట్టు సీబీఐ పేర్కొన్నది. వైటీపీఎస్కు మంజూరు చేసిన పర్యావరణ అనుమతులపై ముంబై, విశాఖపట్టణం కేంద్రాలుగా పనిచేసే రెండు ఎన్టీవో సంస్థలు దాఖలు చేసిన కేసులను వాదిస్తున్నది రిత్విక్దత్తాయే కావడం గమనార్హం. సీబీఐ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. రిత్విక్దత్తాకు చెందిన ‘లైఫ్’ సంస్థకు అమెరికాకు చెందిన ‘ఎర్త్జస్టిస్’ సంస్థ నుంచి విదేశీ నిధులు అందుతున్నాయి. ఈ నిధులను భారతదేశంలోని బొగ్గు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేసి వాటి నిర్మాణాలను ఆపేందుకు ఉపయోగిస్తున్నట్టు సీబీఐ గుర్తించింది.
రిత్విక్దత్తాకు 2013-14లో అమెరికా సంస్థ నుంచి రూ.41 లక్షల విదేశీ నిధులు అందాయని సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే దత్తా నేతృత్వంలో ఆవిర్భవించిన లైఫ్ సంస్థకు 2016-2021 మధ్యకాలంలో మొత్తంగా రూ.22 కోట్ల విదేశీ నిధులు వచ్చాయన్నది సీబీఐ అభియోగం. ఎర్త్జస్టిస్ సంస్థ వివిధ దేశాల్లోని న్యాయవాదులకు ఫండింగ్ చేస్తూ.. ఆయా దేశాల్లో బొగ్గు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేయించి, తద్వారా ప్రాజెక్టులను నిలిపివేయడమే లక్ష్యంగా విదేశీ నిధులను గుమ్మరిస్తున్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ నుంచి దత్తాకు కూడా నిధులు వచ్చినట్టుగా తెలిపింది. యూరోపియన్ ైక్లెమేట్ ఫౌండేషన్ (ఈసీఎఫ్) అనే సంస్థ కూడా 1,20,000 అమెరికా డాలర్ల నిధిని ఎర్త్జస్టిస్ సంస్థ ద్వారా లైఫ్సంస్థకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని, ఈ నిధులతో వివిధ ప్రాజెక్టులను అడ్డుకునేలా పిటిషన్లు వేయాలనే ఆలోచన ఉన్నట్టు సీబీఐ పేర్కొన్నది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఎన్జీవోల ముసుగులో పిటిషన్లు వేసినట్టు స్పష్టమవుతున్నది.