చండూరు (గట్టుప్పల్), అక్టోబర్ 2 : తెలంగాణకు ద్రోహం చేయడానికే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో నూతన మండలంగా ఏర్పాటైన గట్టుప్పల్లో ఆదివారం తాసిల్దార్, పోలీస్ స్టేషన్ కార్యాలయాలను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అంతరాయం కలిగిస్తున్న బీజేపీకి ఓ వ్యక్తి అమ్ముడు పోవడం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందన్నారు.
రాష్ర్టాభివృద్ధికి మోకాలు అడ్డుపెడుతున్న బీజేపీకి కోవర్టుగా మారి తన వ్యక్తిగత స్వలాభం కోసం రూ.22 వేల కోట్లకు 2.22 లక్షల మంది ఓటర్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అమిత్షాను మునుగోడుకు తీసుకొచ్చిన రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు రాష్ట్రాల ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. రైతుల నడ్డి విరిచేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడుతున్నదని విమర్శించారు. గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి కానుకగా ఇవ్వాలని కోరారు.
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం గట్టుప్పల్లో కాంగ్రెస్కు చెందిన స్థానిక నాయకులు, చండూరు మండలం చామలపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 30 మంది మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడ మండలం అంతంపేటకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య శనివారం బీజేపీలో చేరగా.. ఆదివారం గట్టుప్పల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సమక్షంలో తిరిగి గులాబీ గూటికి చేరారు. నాంపల్లి మండలం నామానాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు కే శ్రీనుతోపాటు 32 కుంటుబాల వారు కాంగ్రెస్, బీజేపీ నుంచి హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.